కమలాపూర్, ఆగస్టు 11 : తల్లిలాంటి పార్టీకి రాజేందర్ వెన్నుపోటు పొడిచారని ఎమ్మెల్యే బాల్కసుమన్ విమర్శించారు. కమలాపూర్ మండలం ఖాసింపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆరు సార్లు ఎమ్మెల్యేను చేసి రెండుసార్లు మంత్రిని చేస్తే.. ఏమాత్రం గురుత్వం లేకుండా రాజేందర్ వ్యవహరించారని మండిపడ్డారు. ఇప్పుడు ఆత్మగౌరవం పేరిట మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ముందుకొస్తున్నారని, ఆయన మాటలు నమ్మవద్దని సూచించారు. నిన్నటివరకు లెఫ్టిస్ట్ భావాలున్న ఉన్నవాడినని చెప్పుకుంటూ.. ప్రస్తుతం మతతత్వ పార్టీలోకి వెళ్లి అత్మవంచన చేసుకున్నాడని విమర్శించారు. నిన్నటి వరకు ప్రభుత్వ పథకాలే వద్దని చెప్పి గ్లోబల్ ప్రచారం చేసిన ఆయన.. ఇప్పుడు పథకాలను హుజూరాబాద్కే కాకుండా రాష్ట్ర మంతటా అమలు చేయాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
ప్రస్తుతం ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. రాజేందర్ గెలిస్తే. ఆగెలుపు అతని ఒక్కడికే సొంతమవుతుందని, అతనొక్కడే బాగు పడుతాడని, కానీ, టీఆర్ఎస్ గెలిస్తే హుజూరాబాద్ ప్రజలంతా గెలిచినట్లు అవుతుందన్నారు. ఎన్నో అభివృద్ధి పనులను చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ప్రతి సమస్యనూ త్వరిత గతిన పరిష్కరించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. భూములు కబ్జాలు చేసి, పదవులను సొంతానికి వాడుకున్న రాజేందర్ ముఖ్యమా..? లేక నిస్వార్థ ఉద్యమకారుడు అవినీతి మచ్చలేని గెల్లు శ్రీనివాస్యాదవ్ అవసరమా? అన్నది బేరీజు వేసుకోవాలని సూచించారు. ప్రజలంతా టీఆర్ఎస్ వైపు నిలబడి.. గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.