Huzurabad | హుజూరాబాద్ : హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ నేతలు, కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలతో కావాలనే గొడవలకు దిగుతున్నారు. ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుండడంతో ఓర్వలేక, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేలా వికృతంగా ప్రవర్తిస్తున్నారు. ఒకవైపు బీజేపీ కార్యకర్తలే పోలింగ్ బూతుల వద్ద ప్రచారం చేస్తూ.. టీఆర్ఎస్ కార్యకర్తలే ప్రచారం చేస్తున్నారని షో క్రియేట్ చేస్తున్నారు. అయినా, ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.
మధ్యాహ్నం ఒంటి గంట వరకు దాదాపు 45.65 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఓటర్లలో ఈ మార్పును జీర్ణించుకోలేని బీజేపీ నేతలు గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, పోలీసులు చాలా ఓపికతో వ్యవహరిస్తూ పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా కృషి చేస్తున్నారు. అక్కడక్కడా చిన్నచిన్న ఘటనలు జరిగినా.. ఇరు వర్గాలను చెదరగొట్టి స్థానిక ఓటర్లకు భరోసా కల్పిస్తున్నారు. ఈసారి ఓటింగ్ శాతం పెంచి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓటర్లకు పిలుపునిచ్చారు.