వెంగళరావునగర్, డిసెంబర్ 9: సినిమాను తలపించే డ్రామా ఇది. ఒక భార్య కోసం ఇద్దరు భర్తల పోరాటమది. హనుమకొండకు చెందిన లంకా శశికాంత్(42)కు 23 ఏండ్ల కిందట కాజీపేటకు చెందిన దుర్గా సుశీల (35)తో వివాహమైంది. వీరికి కొడుకు (16), కూతురు (13) ఉన్నారు. కొంతకాలం కిందట ఫేస్బుక్లో పరిచయమైన ఏపీలోని అమలాపురం కొత్తపేటకు చెందిన రాయుడు సత్యవరప్రసాద్తో ఆమె ప్రేమలో పండింది. గత ఆగస్టు 20న పుట్టింటికని వెళ్లిన సుశీల తిరిగిరాలేదు. ఇంట్లో 10 తులా ల బంగారు నగలు, 25 తులాల వెండి ఆభరణాలు, రూ.లక్ష నగదు కూడా మాయమవడంతో సుబేదారి పోలీసులకు భర్త ఫిర్యాదు చేశాడు. సుశీల, సత్యవరప్రసాద్ కలిసి హైదరాబాద్లోని బల్కంపేట ప్రశాంత్కాలనీలో సహజీవనం చేశారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సామూహిక వివాహాల్లో పెండ్లి చేసుకొన్నారు. ఎట్టకేలకు వీరి జాడ గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శశికాంత్ తన భర్తే కాదని, తన బావ అని, అక్క చనిపోతే చుట్టపుచూపుగా వెళ్లానని, ఆ పిల్లలు తన పిల్లలు కాదంటూ సుశీల విచారణలో బుకాయించింది. జైలు నుంచి విడుదలయ్యాక కూడా సుశీల, సత్యవరప్రసాద్ తమ బంధాన్ని కొనసాగించారు. తనకు విడాకులు ఇవ్వకుండానే సుశీల చేసుకున్న మరో పెండ్లి చెల్లదని, తన పిల్లల కోసమైనా ఆమెను పంపాలంటూ ఎస్ఆర్నగర్ పోలీసులను శశికాంత్ కోరుతున్నాడు. మరోవైపు సుశీల ఇంటి నుంచి అదృశ్యమైందని, ప్రస్తుతం ఆమె 3 నెలల గర్భవతి అని, వెతికి పెట్టాలంటూ రెండో భర్త ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్లో మంగళవారం ఫిర్యాదుచేశాడు. ఆమె ఎక్కడికి వెళ్లిందనేది మిస్టరీగా మారిం ది. సత్యవరప్రసాద్ను విచారణకు పిలిస్తే సహకరించటంలేదని పోలీసులు చెప్తున్నారు.