శాయంపేట, ఫిబ్రవరి 18: బతుకుదెరువు కోసం వెళ్లిన దంపతులు రోడ్డు ప్రమాదంలో ఒక్కరోజు తేడాతో మృతి చెందారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మైలా రం గ్రామానికి చెందిన గడిపె రవి, లలిత దంపతులు. 23 ఏండ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లారు. జీహెచ్ఎంసీలో స్వీపర్లుగా పనిచేస్తున్నారు. ఈ నెల 15న పనులు ముగించుకుని భార్యాభర్తలు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా నేరెడ్మెట్ క్రాస్ వద్ద కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ లలిత శనివారం మృతి చెందగా గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. రవి పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందారు. వీరి కూతురు పీజీ, కొడుకు ఇంటర్ చదువుతున్నారు.