హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): మానవ అక్రమ రవాణాను అరికట్టాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఏర్పడక ముందు, ఆ తర్వాత మానవ అక్రమ రవాణాను ఏ స్థాయిలో అరికట్టామో వివరాలు అందజేయాలని సూచించారు. ఈ అంశంపై మంగళవారం కమిషన్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గత ఐదేండ్లలో నమోదైన కేసుల వివరాలు అందజేయాలని పోలీసులను ఆదేశించారు. మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రతి రోజూ 50 నుంచి 60 మిస్సింగ్ కేసులు నమోదు అవుతుండగా, ఇందులో 20 శాతం వరకు 15 నుంచి 20 ఏండ్లలోపు వారే ఉంటున్నారని ఓ పోలీసు అధికారి చెప్పారు. మిస్సింగ్ కేసులలో అధికశాతం ఇతర రాష్ర్టాల పిల్లలు, బాలకార్మికులేనని, వీరందరినీ గుర్తించి రక్షించడంతోపాటు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తూ, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామని అధికారులు వివరించారు. సమీక్షలో మహిళా కమిషన్ సెక్రటరీ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.