హైదరాబాద్: నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులు నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్పై (Riyaz Encounter) హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ (Judicial Inquiry) జరిపించాలని తెలంగాణ మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది. ఈ ఎన్కౌంటర్ను హైకోర్టు, తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకుని న్యాయ విచారణ జరపాలని కోరింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా, వారికి శిక్ష పడేలా చేయాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భుజంగరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. తిరుపతయ్య డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని, వారిపై హత్యా నేరం మోపాలన్నారు.
‘నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానలో కానిస్టేబుల్ తుపాకీ గుంజుకుని, అతనిపై తిరగబడ్డాడనే పేరుతో షేక్ రియాజ్ని పోలీసులు చంపేయటం బూటకపు ఎన్కౌంటర్ మాత్రమే కాక, ఇది తెలంగాణా పోలీసు శాఖలో పెరుగుతున్న హింసాప్రవృత్తికి నిదర్శనం. ఈ నెల 17న బైకులు, చైన్ స్నాచింగ్ లాంటి దొంగతనాలకు పాల్పడుతున్న రియాజ్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించే క్రమంలో.. బైక్ నడుపుతున్న కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో పొడిచి, అక్కడి నుండి పారిపోయాడు. ఊహించని ఈ దాడి కారణంగా కానిస్టేబుల్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆ కానిస్టేబుల్ న్యాయంగా డ్యూటీ నిర్వహిస్తుండగా, అతనిపై జరిగిన దాడిలో చనిపోవటం చాలా బాధాకరం. హంతకునికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అయితే ఆ శిక్షను ఎవరు అమలు చేయాలనేదే నాగరిక సమాజంలో కీలకమైన విషయం.
నిందితుడు ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష నుంచి తప్పించుకోకుండా పోలీసులు తగిన సాక్ష్యాధారాలతో అతని నేరాన్ని నిరూపించి, చట్ట ప్రకారం కోర్టు ద్వారా శిక్ష పడేలా చేయటానికి అవకాశాలున్నాయి. కానీ, అలా కాకుండా పోలీస్ వ్యవస్థ రియాజ్ను హత్య చేయాలని ముందే నిర్ణయించుకున్నట్టుగా అనిపిస్తున్నది. ముందస్తు పథకం ప్రకారమే పోలీసుల మీద మరొకరు తిరుగుబాటు చేయకుండా, రియాజ్ ఉదంతం ఒక బెదిరింపుగా ఉండాలని చేసిన కౌంటర్ హత్య అని మా అనుమానం. తెలంగాణ పోలీసుల మానసిక వైఖరి, వారి ఎన్కౌంటర్ల చరిత్రలే ఇందుకు ఆధారాలు.
ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు అంటే తెలియని సామాన్య ప్రజలు ఈ విషయంలో పోలీసులకు వత్తాసు పలుకుతుండవచ్చు. కానీ, ఒక సమాజం నియమబద్ధంగా నడావలా లేక, కంటికి కన్ను, పంటికి పన్ను అనే ఆటవిక సమాజం లాగా నడవాలా అనేది మెజారిటీ మద్దతు ఉందనే పేరుతో నడవాల్సిన వ్యవహారం కాదు. ఒక ఆసుపత్రి నాలుగో అంతస్తులో, చుట్టుపక్కల వేరెవరు రోగులూ, వారి బంధువులూ లేకుండా ఉంచిన గదిలో జరిగిన ఈ హత్య నిజమైన ఎన్కౌంటర్ కాదని, బూటకపు ఎన్కౌంటర్ అని నిరూపించడానికి మృతుని బంధువులకు గానీ, హక్కుల సంఘాలకు గానీ, స్వచ్ఛంద సంస్థలకు గానీ ఎటువంటి అవకాశం ఉండదు. కాబట్టి రూల్ ఆఫ్ లాను, కోర్టులను, రాజ్యాంగ నియమాలని కాపాడటమా, లేక ‘వారిలో ఒక మనిషి చనిపోతే వారు ఊరుకుంటారా?’ అని సరిపెట్టటమా అనేది ఈరోజు ప్రభుత్వం, రాష్ట్ర, జాతీయ మానవ హక్కుల కమిషన్లు, హైకోర్టు, సుప్రీంకోర్టుల ముందూ ఉన్న ప్రశ్న అని మానవ హక్కుల వేదిక నేతలు అన్నారు.