హైదరాబాద్: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొన్నది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనం పల్లె బాట పట్టారు. దీంతో ఎన్హెచ్ 65పై వాహనాలు బారులు తీరాయి. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో వాహనాల రద్దీ మరింత పెరిగింది.
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజాము నుంచే దట్టంగా పొగమంచు కమ్ముకున్నది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సాధారణ రోజులకంటే వాహనాల రాకపోకలు భారీగా పెరగడంతో టోల్ప్లాజాల వద్ద టోల్ట్యాక్స్ చెల్లింపు కేంద్రాలను అధికారులు పెంచారు. అయితే ఫాస్టాగ్లో నగదు చెల్లింపుతో టోల్ప్లాజాల వద్ద సాఫీగా రాకపోకలు సాగుతున్నాయి.
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయానికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. సొంతూళ్లకు వెళ్లే ప్రజల సౌకర్యార్థం 4,360 బస్సులను ఏర్పాటు చేసింది. అందులో 590 బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాచలం, విజయవాడ, నెల్లూరు, గంటూరు, ఒంగోలు పట్టణాలతో పాటు.. కర్ణాటక, మహారాష్ట్రలకు బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం ఉండనుంది. ప్రత్యేకబస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలను వసూలు చేయడంలేదని ఆర్టీసీ ప్రకటించిన విషయం తెలిసిందే