నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగం పట్ల సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తుందని నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు నోముల భగత్ అన్నారు. యాసంగిలో తెలంగాణ రాష్ట్ర రైతాంగం పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుతూ శుక్రవారం హాలియాలో రైతుల పక్షాన మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు.
అంతకు ముందు 200 ట్రాక్టర్లతో హాలియాలో రైతులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో అతి ఎక్కువ ధాన్యం పండించే రాష్ట్రాలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం పంజాబ్ రాష్ట్ర రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన విధంగానే తెలంగాణరైతాంగం నుంచి కూడా నూటికి నూరుశాతం యాసంగిలో పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్ ఇరిగి పెద్దలు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు రామచంద్రనాయక్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎంసీ కోటిరెడ్డి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు.