హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): కొత్త నోటిఫికేషన్లతో ఉద్యోగాలు పొందనున్న వారికి బంపర్ ఆఫర్ తగిలింది. కొత్తగా ఉద్యోగాలకు ఎంపికయ్యేవారికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పేస్కేల్స్ను అమలు చేయనున్నది. ఉద్యోగంలో చేరిన కొత్తలోనే వీరంతా మంచి వేతనాలు పొందనున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం ఇటీవల వెలువరించిన అన్ని నోటిఫికేషన్లలోనూ ప్రకటించింది. పాత పేస్కేల్స్ స్థానంలో కొత్త వాటిని నోటిఫై చేశారు.
తొలుత 17 వేల పోస్టులతో పోలీసు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదలైంది. 503 పోస్టులతో గ్రూప్ -1.. తర్వాత మున్సిపల్, రవాణాశాఖ, ఇరిగేషన్, మహిళా శిశు సంక్షేమ శాఖల్లో పోస్టుల భర్తీ వేగిరమైంది. అన్ని నోటిఫికేషన్లలోనూ ప్రభుత్వం కొత్త పేస్కేల్స్ను నోటిఫై చేసింది. మరో పీఆర్సీని ప్రకటించే వరకూ ఇవే వేతనాలు అమల్లో ఉండనున్నాయి.
మనోళ్లకే అత్యధిక జీతాలు
దేశంలో తెలంగాణ ఉద్యోగులు పొందుతున్న జీతాలే ఎక్కువని తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ఈ తరహా వేతనాలు అందడంలేదు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో 2015లో 43 శాతం భారీ ఫిట్మెంట్ను ప్రభుత్వం ప్రకటించింది. 2022 పీఆర్సీలో భాగంగా 30 శాతం వేతనాలు పెంచింది. పీఆర్సీ కమిషన్ కేవలం 7.5 శాతం సిఫారసు చేస్తే పెద్ద మనసున్న సీఎం కేసీఆర్ అంతకు నాలుగురెట్లకుపైగా పెంచి ఉద్యోగుల పట్ల ఉన్న నిబద్ధతను చాటుకొన్నారు.
గతంలో తెలంగాణలో ఆఫీస్ సబార్డినేట్ వేతనం రూ.19 వేలు ఉండగా, 2020 పీఆర్సీతో 22,240 అయ్యింది. అదే కేంద్ర ప్రభుత్వంలోని ఆఫీస్ సబార్డినేట్ వేతనం నెలకు రూ.18 వేలు మాత్రమే. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఆఫీస్ సబార్డినేట్ వేతనంగా నెలకు రూ.14 వేలు మాత్రమే ఇస్తున్నారు. ఇలా ఏ స్థాయిలో పరిశీలించినా అందరి కంటే మన రాష్ట్ర ఉద్యోగుల జీతాలు గొప్పగానే ఉన్నాయి.