హైదరాబాద్: నూతన సంవత్సరం (New Year ) సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, భద్రకాళి టెంపుల్, బాసరతోపాటు హైదరాబాద్లోని బిర్లా టెంపుల్, చిలుకూరు బాలాజీ ఆలయం, దిల్సుఖ్నగర్ సాయిబాబా ఆలయం సహా పలు క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నది. ప్రత్యేక దర్శనానికి 2 గంటలు పడుతున్నది.
ఇక వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. సోమవారం అందునా కొత్త ఏడాది తొలిరోజు కావడంతోపాటు మేడారం జాతరకు ముందుగా రాజన్నను దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు. దీంతో గర్భగుడిలో ఆర్జిత సేవలను అధికారులు రద్దుచేశారు. గుండంలో స్నానాలు ఆచరించిన భక్తులు.. స్వామివారికి కోడె మొక్కులను చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొన్నది. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.