హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం వైద్యారోగ్య శాఖ నిర్వహిస్తున్న ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. గత రెండు మంగళవారాల్లో మొత్తం 11,121 మందికి స్రీనింగ్ నిర్వహించారు. మహిళల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంతోపాటు వారికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేకంగా ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి రూపకల్పన చేసిన విషయం విదితమే. దీనిలో భాగంగా 24 జిల్లాల్లో ప్రత్యేకంగా 100 ‘ఉమెన్ స్పెషల్ క్లినిక్’లను ఏర్పాటుచేసి, ప్రతి మంగళవారం మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు కరీంనగర్లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ నెల 14న తొలి మంగళవారం 4,793 మంది మహిళలకు స్రీనింగ్ నిర్వహించి, 975 మందికి అవసరమైన మందులు అందజేశారు. వైద్యపరీక్షల కోసం 2,723 నమూనాలను సేకరించి తెలంగాణ డయాగ్నస్టిక్స్కు పంపారు. మెరుగైన వైద్యపరీక్షల నిమిత్తం 85 మందిని పెద్ద దవాఖానలకు రెఫర్ చేసి వైద్య సేవలు అందేలా చూస్తున్నారు.
ఈ నెల 21న రెండో మంగళ వారం 6,328 మంది మహిళలు ‘ఆరోగ్య మహిళ’ క్లినిక్స్ను సందర్శించారు. వీరందరికీ 8 రకాల వైద్యపరీక్షలతోపాటు మూడు రకాల క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు. అవసరమైనవారి నుంచి మొత్తం 2,792 నమూనాలను సేకరించి తెలంగాణ డయాగ్నస్టిక్స్కు పంపారు. విటమిన్-డీ లోపాన్ని నిర్ధారించేందుకు 477 మంది నుంచి, సీబీపీ (కంప్లీట్ బ్లడ్ పిక్చర్) కోసం 1,294 మంది నుంచి రక్త నమూనాలను సేకరించారు.
మహిళల హర్షం
ప్రతి వారంలో ఒకరోజును తమకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందిస్తుండటంపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో చాలా మంది మహిళలకు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులకు చెప్పుకోవడం ఇష్టంలేక కొందరు.. వ్యాధి లక్షణాలపై అవగాహనలేక మరికొందరు.. వ్యయ ప్రయాసలకోర్చి దవాఖానల చుట్టూ తిరగలేక మరికొందరు ఇబ్బంది పడుతున్నారు. అలాంటివారు ఇప్పుడు నేరుగా ‘ఆరోగ్య మహిళ’ కేంద్రాలకు వెళ్లి ఉచితంగా వైద్యసేవలు పొందుతున్నారు. మొదటి దశలో 100 కేంద్రాల్లో ప్రారంభమైన ఈ వైద్యసేవలను దశలవారీగా 1,200 కేంద్రాలకు విస్తరించనున్నారు. వీటిలో మహిళలకు 8 రకాల వైద్యసేవలు అందిస్తున్నారు.
ఆ సేవలు ఇవీ..
మహిళల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం
సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ‘ఆరోగ్య మహిళ’ అనే అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, విజయవంతంగా అమలు చేస్తున్నది. రాష్ట్రంలోని మహిళల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి మంగళవారం 100 అరోగ్య కేంద్రాల ద్వారా మహిళలకు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. వారు ప్రధానంగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలను గుర్తించి వైద్యం అందిస్తున్నాం. ఎంతో బృహత్తరమైన ఈ కార్యక్రమాన్ని మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలి.
– హరీశ్రావు,ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి