హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదిత తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల(టీఎస్ఎఫ్పీజెడ్)కు ఔత్సాహికులనుంచి భారీ స్పందన వచ్చింది. సోమవారం గడువు పూర్తి కాగా, మొత్తం 749 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో అత్యధికం రైస్మిల్లులు, పార్బాయిల్డ్ మిల్లుల ఏర్పాటుకు సంబంధించినవే ఉన్నాయి. దరఖాస్తు ఫీజు రూపంలో ప్రభుత్వానికి రూ.45 కోట్ల ఆదాయం సమకూరింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ మినహా 30 జిల్లాల నుంచి దరఖాస్తులు రాగా, నల్లగొండ నుంచి అత్యధికంగా 167 వచ్చాయి. రైస్, పార్బాయిల్డ్ మిల్లులతో పాటు మిర్చి, పసుపు, జొన్న, గోదాములు, కోల్డ్ స్టోరేజీలు, బిస్కెట్లు, చాక్లెట్లు, ఇతర పిల్లల తినుబండారాల పరిశ్రమలు, మాంసం, చేపలు, చికెన్ శుద్ధి పరిశ్రమలు, వంటనూనెలు, పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు తదితర వాటి ప్రాసెసింగ్ యూనిట్ల దరఖాస్తులు ఉన్నాయి. రాష్ట్రంలో వరి దిగుబడి అధికంగా ఉండటంతో రైస్మిల్లుల ఏర్పాటునకు అధిక దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రాసెసింగ్ జోన్ల విషయంపై ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది మంగళవారం జరిగే రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
జిల్లాలవారీ దరఖాస్తుల వివరాలు
నల్లగొండ-167, నిజామాబాద్-86, ఖమ్మం-82, రంగారెడ్డి-58, మెదక్-41, సిద్దిపేట-37, మహబూబ్నగర్-27, సంగారెడ్డి- 27, మంచిర్యాల-23, వరంగల్(అర్బన్)- 22, నిర్మల్-21, యాదాద్రి భువనగిరి-21, కామారెడ్డి-20, వనపర్తి-20, వికారాబాద్-13, నాగర్కర్నూల్-12, ములుగు-10, హైదరాబాద్-9, సూర్యాపేట-9, రాజన్న సిరిసిల్ల-8, కరీంనగర్-7, జనగామ-6, మహబూబాబాద్-6, మేడ్చల్ మల్కాజ్గిరి- 6, జోగులాంబ గద్వాల-3, పెద్దపల్లి-3, వరంగల్(రూరల్)- 2, భద్రాద్రి కొత్తగూడెం- 1, జగిత్యాల-1, జయశంకర్ భూపాలపల్లి-1