హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేయాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా ఊపందుకుంటున్నది. సీపీఎస్ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్నే పునరుద్ధరించాలని కోరుతూ నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం(ఎన్ఎంవోపీఎస్) ఆధ్వర్యంలో శనివారం కేరళ రాజధాని త్రివేండ్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సచివాలయం ఎదుట చేపట్టిన భారీ ధర్నాలో ఓపీఎస్ను పునరుద్ధరించాలంటూ నినదించారు. ఆందోళనలో ఎన్ఎంవోపీఎస్ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ (తెలంగాణ), షాహిద్ రఫీక్ (కేరళ), రంగనాథ్ (కర్ణాటక), ఆరోగ్యదాస్ (తమిళనాడు) తదితరులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్, కోశాధికారి నరేశ్గౌడ్ తదితరులు హాజరయ్యారు.