సమతామూర్తిని దర్శించుకున్న ప్రముఖులు
భద్రవేదికపై ఆశీనుడైన రామానుజుడు
5వ రోజు కొనసాగిన సహస్రాబ్ది సమారోహం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 : సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారంనాడు లక్ష్మీనారాయణ సహస్ర కుండాత్మక మహాయజ్ఞంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యజ్ఞంలో భాగంగా నిర్వహించిన మంత్ర జపం, ఆహుతి, తర్పణం, పుష్పార్చన, తదియారాధన(భోజనం) కార్యక్రమాల్లో పాల్గొని, ప్రవచనాలను ఆలకించారు. త్రిదండి రామానుజ చినజీయర్స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన పూజల్లో అహోబిల రామానుజ జీయర్స్వామి, దేవనాథ రామానుజ జీయర్స్వామి, రామచంద్ర రామానుజ జీయర్స్వామి, అష్టాక్షరి రామానుజ జీయర్స్వామి, వ్రతధర రామానుజ స్వాములు పాల్గొని భక్తులకు ఆశీర్వచనాలను అందించారు. యాగశాలలో ఐదోరోజు పూజలు, నిత్య పూర్ణాహుతి నిర్వహించారు. 216 అడుగుల ఎత్తులో కొలువుదీరిన రామానుజాచార్యుల విగ్రహాన్ని భక్తులు దర్శించుకొన్నారు. నిత్యపూజల్లో మైహోం సంస్థల చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, ఎండీ జూపల్లి జగపతిరావు తదితరులు పాల్గొన్నారు. రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో 54 అడుగుల ఎత్తైన భద్రవేదికపై అమర్చారు. వేద డిజిటల్ లైబ్రరీ, పరిశోధనా కేంద్రం, ప్రాచీన భారతీయ గ్రంథాలు, థియేటర్, రామానుజాచార్య రచనలను వివరించే విద్యా గ్యాలరీని కూడా ఇక్కడ నెలకొల్పారు.
సమతామూర్తిని దర్శించుకున్న ప్రముఖులు
ముచ్చింతల్లోని సమతామూర్తిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో జస్టిస్ పొనుగంటి నవీన్రావు, జస్టిస్ అభిషేక్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘుపతి, జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్, ఆ పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, మాజీ డీజీపీ అరవింద్రావు, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జవహర్రెడ్డి, ఐసీఎఫ్ఏఐ వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ జగన్నాథన్ పట్నాయక్ (సిక్కిం), జగద్గురు స్వామి రామచంద్రాచార్య మహారాజ్ (రాజస్థాన్) తదితరులు ఉన్నారు.
నేడు ముచ్చింతల్కు ఏపీ సీఎం జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం ముచ్చింతల్కు రానున్నారు. ఈ నెల 8న కేంద్ర మంత్రి అమిత్షా, 9న ఆరెస్సెస్ చీఫ్ మోహన్భగవత్, 10న కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్,11న కేంద్ర మంత్రి నితిన్గడ్కరీ, 12న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, 13న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రానున్నారు.