సూర్యాపేట టౌన్/రాజాపూర్/ నవాబ్పేట, ఏప్రిల్ 22: టీఆర్ఎస్ పార్టీలోకి వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తల చేరికలు వెల్లువలా సాగుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పలు పార్టీల నాయకులు కారెక్కేందుకు ఉత్సాహం చూపుతున్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం నాగులపాటి అన్నారం సర్పంచ్ ధనియాకుల కోటమ్మా సత్యనారాయణ బీజేపీకి రాజీనామా చేసి వార్డు సభ్యులతోపాటు 200 మందికిపైగా కార్యకర్తలతో విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రంలో జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి సమక్షంలో దోండ్లపల్లి ఎంపీటీసీ అభిమన్యురెడ్డి ఆధ్వర్యంలో సింగమగూడ సర్పంచ్ చాందితోపాటు 60 మంది కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. అలాగే రాయపల్లికి చెందిన 50 మంది దళితులు టీఆర్ఎస్ నాయకుడు మల్లేష్గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. నవాబ్పేటకు చెందిన 10 మంది కాంగ్రెస్ యువ నాయకులు హైదరాబాద్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు.