నమస్తే తెలంగాణ, నెట్వర్క్: మూడురోజులుగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దయింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, ప్రాజెక్టులకు భారీగా వరద చేరుతున్నది. ఎడతెరిపిలేని వర్షాలతో ఊరూరా జలధార పారుతున్నది. హైదరాబాద్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు కుండపోత వర్షం పడింది. మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. మెదక్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, వికారాబాద్, జగిత్యాల, కరీంనగర్, మహబూబ్నగర్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. మరికొన్ని జిల్లాలో మోస్తరు వానలు పడ్డాయి. అనేక చోట్ల రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాష్ట్రంలో వేర్వేరు ఘటనల్లో ఆరుగురు చనిపోయారు. కరీంనగర్ జిల్లాలో మంగళవారం 45.9 మి.మీ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 80.9 సగటు వర్షపాతం నమోదయ్యింది.
సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో మోస్త్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మెదక్ జిల్లాలో మంజీరా నది ఉధృతంగా ప్రవహించడంతో వనదుర్గా ప్రాజెక్ట్ పొంగి పొర్లుతున్నది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లాలో రెండు రోజులుగా ముసురు పడుతున్నది. నల్లగొండ జిల్లా అంతటా మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు వర్షం పడింది. అత్యధికంగా మిర్యాలగూడలో 45.8 మి.మీ. వర్షం పడగా, అత్యల్పంగా చండూరులో 1.5 మి.మీ. వర్షం పడింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరిపి లేని ముసురు పడుతున్నది. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో భూదాన్ పోచంపల్లి మండలంలోని జూలూరు – రుద్రవెల్లి గ్రామాల మధ్య రాకపోకలను నిలిపివేశారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మంగళవారం మోస్తరు వర్షం కురిసింది. ప్రస్తుత వర్షాలతో పంటలకు ప్రాణం లేచివచ్చింది. వరి, పత్తి, మిర్చి తదితర పంట చేలల్లో కలుపుతీసే పనిలో కూలీలు నిమగ్నమయ్యారు.
ఎస్సారెస్పీకి భారీగా వరద
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో రావడంతో 16 గేట్లు ఎత్తి 64 వేల క్యూసెక్కులను గోదావరిలోకి వదులుతున్నారు. నిజాంసాగర్ ఐదుగేట్లు ఎత్తి 35 వేల క్యూసెక్కులను మంజీరా నదిలోకి వదులుతున్నారు. ఎల్లంపల్లికి సైతం 3.18 లక్షల క్యుసెక్కులకు వరద వస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి నది ప్రవాహం పెరుగుతున్నది. లక్ష్మీబరాజ్కు మంగళవారం సాయంత్రం నాటికి 2.24 లక్షల క్యుసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. అంతే స్థాయిలో వరదను అధికారులు కిందికి వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో ఉధృతంగా ప్రవహిస్తున్నది. మరోవైపు కృష్ణాలో వరద కనిపించడం లేదు.
కలెక్టర్లను అప్రమత్తం చేసిన మంత్రి సత్యవతి
రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపిలేని భారీ వర్షాల నేపథ్యంలో మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లతో మంత్రి సత్యవతి రాథోడ్ మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని ఆమె ఆదేశించారు. నిండిన జలాశయాల్లో నీటిమట్టాలను పర్యవేక్షిస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
వర్షాలతో ఏడుగురు మృతి
ట్రాన్స్ఫార్మర్లతో జాగ్రత్త
భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్తు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ జీ రఘుమారెడ్డి సూచించారు. స్వీయ రక్షణే.. శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. వర్షాలు, వరదల నేపథ్యంలో మంగళవారం వినియోగదారులకు పలు సూచనలు చేశారు. చీఫ్ జనరల్ మేనేజర్లు, సూపరింటెండెంటింగ్ ఇంజినీర్లతో ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్తు సరఫరా పరిస్థితిని సమీక్షించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 23 విద్యుత్తు డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపామని, ప్రతి బృందంలో 15 మంది నైపుణ్య కార్మికులుంటారని, వీరంతా 24 గంటలు సేవలందిస్తారని సీఎండీ వెల్లడించారు. విద్యుత్తుకు సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా 1912 / 100/ స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్తోపాటు విద్యుత్తుశాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106, 7382071574కు ఫోన్లో ఫిర్యాదు చేయాలని కోరారు. సంస్థ మొబైల్ యాప్, వెబ్సైట్, ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా కూడా సమస్యలను తమ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు.
సూచనలిలా..