హైదరాబాద్ : మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం హార్టికల్చర్ ట్రైనింగ్ సెంటర్లో మత్స్య శాఖ అధికారుల వర్క్ షాప్లో పాల్గొని మంత్రి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో మత్స్య శాఖకు సరైన ఆదరణ, నిధుల కేటాయింపులు లేవన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్య రంగ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా కోట్లాది రూపాయల వ్యయంతో ఉచితంగా చేప, రొయ్య పిల్లలను పంపిణీ చేస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా చేప పిల్లలను రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందన్నారు. దీంతో మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. మత్స్యకారులు అందరికి ప్రభుత్వ పథకాలు అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అర్హులైన 18 సంవత్సరాలు నిండిన ప్రతి మత్స్య కారుడికి మత్స్య సొసైటీలో సభ్యత్వం కల్పిస్తామని హామీనిచ్చారు.