హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. ఎగువ నుంచి శ్రీశైలానికి భారీగా వరద వస్తుండటంతో అధికారులు 9 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 3,23,613 క్యూసెక్కులు వస్తుండగా, 3,13,463 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 884.60 అడుగుల వద్ద ఉన్నది. ఇక జలాశాయం గరిష్ట నీటినిల్వ 215 టీఎంసీలు కాగా ఇప్పుడు 213 టీఎంసీల నీరు ఉన్నది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.
నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో అధికారులు 16 గేట్లు ఎత్తి 2.36 లక్షల క్యూసెక్కుల నీటిని స్పిల్వే ద్వారా విడుదల చేస్తున్నారు. ఇక ప్రాజెక్టులోకి 2.40 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా, 2.81 లక్షల క్యూసెక్కుల వరద బయటకు వెళ్తున్నది. సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులకుగాను 588.70 అడుగుల వద్ద ఉన్నది. పూర్తిస్థాయి నీటినిల్వ 312.04 టీఎంసీలు. ప్రస్తుతం 308.17 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.