నిర్మల్: ఎగువన భారీవర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తింతి. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరింది. ప్రాజెక్టులోకి 5 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా, అధికారులు 17 గేట్లు ఎత్తి మూడు లక్షల క్యూసెక్కుల నీటిని బయటికి వదులుతున్నారు. అయితే అవుట్ ఫ్లో కంటే ఇన్ ఫ్లో రెండు లక్షల క్యూసెక్కులు ఎక్కువ ఉండడంతో ప్రాజెక్టు కట్ట పైనుంచి నీరు ప్రవహిస్తుంది. కాగా, ప్రాజెక్టు మొత్తం 18 గేట్లకు గాను ఒకటి మొరాయించింది. దీంతో 17 గేట్లను పూర్తిగా తెరచివేశారు. అయితే వరద ఇంకా పెరిగితే ప్రమాదం పొంచిఉందని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
కాగా, వరద ఉధృతి అధికంగా ఉండటంతో జిల్లా కలెక్టర్ ముష్షరఫ్ ఇతర అధికారులు రాత్రంతా ప్రాజెక్టు వద్ద ఉన్న పరిస్థితిని సమీక్షించారు. కడెం, దస్తురాబాద్ మండలాలకు చెందిన ఇరవై గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. డ్యాం దిగువన ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
జిల్లాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు వరద ఉధృతి భారీగా పెరిగింది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్టస్థాయికి చేరింది. ప్రాజెక్టులోకి 56 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, 42,300 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. వరద ప్రవాహం పోటెత్తడంతో అధికారులు ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇక ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలంలో భారీ వర్షం కురుస్తున్నది. మండలంలోని ఏంకా కాలనీలోని ఇండ్లలోకి నీరు చేరింది. షాంపూర్ వద్ద నాగపూర్ వంతెన పైనుంచి వరద నీరు పారుతున్నది.