హైదరాబాద్: రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో మూసీ నదిలోకి వరద పోటెత్తింది. నేడు వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో మూసీ పరీవాహక ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. నదిలో భారీగా వరద వస్తుండటంతో హైదరాబాద్లోని జియాగూడవద్ద మూసీ పొంగిపొర్లుతున్నది. చాదర్ఘాట్ లోలెవల్ బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తున్నది.
అదేవిధంగా మూసారాంబాగ్ చాందిని బ్రిడ్జిపైనుంచి వరద వెళ్తున్నది. దీంతో అధికారులు చాదర్ఘాట్ లోలెవల్ బ్రిడ్జితోపాటు మూసారాంబాగ్ వంతెనపైనుంచి రాకపోకలను నిలిపివేశారు. చాదర్ఘాట్లోని మూసానగర్, శంకర్ కాలనీ బస్తీలను వరద ముంచెత్తింది. దీంతో ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
కాగా, గండిపేట చెరువు 13 గేట్లను ఒక్కసారిగా ఎత్తివేయడంతో దిగువకు వరద పోటెత్తింది. దీంతో గండిపేట ఫాంహౌస్లో ఉన్న ఓ కుటుంబం వరదలో చిక్కుకున్నది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చిన్నారి సహా ఐదుగురిని రక్షించారు. వారిని పడవల్లో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో వికారాబాద్ జిల్లాలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.