ఎస్సారెస్పీకి 27 వేల క్యూసెక్కులు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ/న్యూస్ నెట్వర్క్, జూలై 8: ఎగువ ప్రాంతాలతోపాటు తెలంగాణలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు వరద పెరిగింది. నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు 27 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 32.70 టీఎంసీలకు చేరుకొన్నది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 24,614 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టుకు 10,588 క్యూసెక్కులు వరద వస్తున్నది.
తుంగభద్ర డ్యాంకు భారీ వరద
కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తింది. శుక్రవారం ఇన్ఫ్లో 90,637 క్యూసెక్కు లు, అవుట్ఫ్లో 183 క్యూసెక్కులుగా నమోదైంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండటంతో శుక్రవారం మూడు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టుకు 3,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 1,800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
కాళేశ్వరంలో వరద ఉద్ధృతి
పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురంలోని పార్వతీ బరాజ్లో నీటి మట్టం పెరిగింది. దీంతో శుక్రవారం 25 గేట్లను ఎత్తి 18,750 క్యూసెక్కుల నీటిని దిగువన గల సరస్వతీ బరాజ్ బ్యాక్ వాటర్లోకి విడుదల చేశారు. ఎగువ నుంచి 1,850 క్యూసెక్కుల నీరు పార్వతీ బరాజ్లోకి వచ్చి చేరుతుండటంతో 8.88 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల బరాజ్లో 4.486 నీరు నిల్వ ఉన్నది. 1,850 క్యూసెక్కుల నీటితోపాటు బొక్కలవాగు, ముత్తారం, మంథని మండలాల నుంచి 3,100 క్యూసెక్కుల వరద సరస్వతీ బరాజ్లోకి వెళ్తున్నది.