యాదాద్రి, సెప్టెంబర్ 10 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ కన్పించింది. స్వామివారి వీఐపీ దర్శనానికి 2 గంటలు, ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. కొండ కింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణిలో భక్తుల సందడి నెలకొన్నది. స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానమాచరించారు.
స్వామివారిని 17,606 మంది దర్శించుకొన్నారని, అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.24,46,608 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. హైదరాబాద్కు చెందిన అక్షర స్కూల్ యాజమాన్య ప్రతినిధులు ఆరిశనపల్లి నారాయణరావు, జగన్మోహన్రావు, మదన్మోహన్రావు స్వామివారి శతఘటాభిషేకానికి వినియోగించే 30 వెండి కలశాలు తయారు చేసేందుకు రూ.9 లక్షల నగదు ఆలయ అధికారులకు అందజేశారు.