వేములవాడ టౌన్: వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. కార్తిక మాసం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు తలనీలాలు సమర్పించి, పవిత్ర స్నానాలు ఆచరించారు. క్యూలో బారులుతీరారు. రాజన్నను సుమారు 50 వేల మంది దర్శించుకోగా.. ఖజానాకు దాదాపు రూ.24 లక్షల ఆదాయం సమకూరినట్టు ఆలయ అధికారులు తెలిపారు.