యాదాద్రి, జూలై 3 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ కన్పించింది. ఆదివారం సెలవు కావడంతో స్వామివారిని దర్శించుకొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కొండపై క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల, తిరుమాడ వీధులు సందడిగా మారాయి. తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచి స్వామివారికి నిత్యపూజలు మొదలయ్యాయి.
ప్రధానాలయంతోపాటు పాతగుట్ట ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. స్వామివారి ధర్మ దర్శనానికి రెండున్నర గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొన్నారని, అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.35,09,668 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు.