హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు చెరువుల్లో ఒక పూటంతా పట్టినా ఒక్క చేపా దొరికేది కాదు. నేడు అవే చెరువుల్లో అలా వెళ్లి ఇలా కిలోల కొద్ది చేపలు పట్టుకొస్తున్నారు మత్స్యకారులు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ఏపీ చెరువుల్లో పెంచిన చేపలే దిక్కయ్యేవి. నేడు మన చెరువుల్లో చేపల పంట పండుతున్నది. వర్షాలతో చెరువులు, కుంటలు అలుగులు దుంకుతుంటే.. చేపల కూర ఇంట్లో ఉడుకుతున్నది. ఇదీ తెలంగాణలో వచ్చిన నీలి విప్లవం. ఇదీ సీఎం కేసీఆర్ అమలుచేసిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం ఫలితం. గతంలో చేపల ఉత్పత్తి అంతంత మాత్రంగానే ఉండటంతో తెలంగాణకు అవసరమైన చేపలు ఏపీ నుంచే ఎక్కువగా దిగుమతి అయ్యేవి. సీజన్తో సంబంధం లేకుండా ఇతర రాష్ర్టాలపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ, రెండు మూడేండ్లుగా ఏపీ నుంచి మంచినీటి చేపల దిగుమతి భారీగా తగ్గిపోయింది. కొద్ది నెలలుగా చేపల దిగుమతి పూర్తిగా బంద్ అయింది.
తెలంగాణలో మత్స్య సంపద భారీగా పెరిగింది. ఇప్పుడు ఇతర రాష్ర్టాలకు మనం రాష్ట్రం చేపలు ఎగుమతి చేసే స్థాయికి చేరింది. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చేపలను ఇక్కడి వ్యాపారులు కొని ఢిల్లీ, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఛత్తీస్గఢ్ అస్సాం వంటి రాష్ర్టాలకు ఎగుమతి చేస్తుండటం గమనార్హం. 2016-17కు ముందు తెలంగాణ రాష్ట్రంలో లక్ష టన్నుల చేపలు ఉత్పత్తి అయితే మహా గొప్ప. 2016-17లో సీఎం కేసీఆర్ సర్కారు ఉచిత చేపల పంపిణీ పథకం ప్రారంభించిన సమయంలో సుమారు 2 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అయినట్టు రికార్డులు చెప్తున్నాయి. అది ఈ ఏడాది 4.38 లక్షల టన్నులకు పెరిగింది. అంటే గడిచిన ఆరేండ్లలో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి సుమారు 125 శాతం పెరిగింది. పథకం ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు 22.5 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అయ్యాయి.
చౌకగా స్థానిక చేపలు
కొర్రమీను ఉత్పత్తి గతంలో తెలంగాణలో చాలా తక్కువగా ఉండేది. ఎక్కువగా ఒడిశా రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకునేవారు. ఈ రకం చేపల ధరలు చుక్కల్లో ఉండేవి. కిలో రూ.800-900 వరకు పలికేది. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో కొర్రమీను ఉత్పత్తి భారీగా పెరిగింది. ప్రస్తుతం కిలో కొర్రమీను రూ.500లకు దిగొచ్చింది. ఇతర చేపల ఉత్పత్తి కూడా భారీగా పెరగడంతో గ్రామాల్లో రవ్వ, బంగారు తీగ చేపలు రూ.100 కిలో దొరకుతున్నాయి. అదే పాంప్లేట్ వంటి చేపలను రూ.100 కిలోన్నర ఇస్తున్నారు. మన చెరువుల్లో పెరిగిన చేపలు కావడంతో గ్రామస్థులు కొఆసక్తి చూపిస్తున్నారు. చేపలు తినడం వల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇలా రెండు లాభాలు ఉండటంతో మటన్, చికెన్కు బదులు చేపల కూర తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవలి వర్షాలతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు అలుగులు పోశాయి. నీళ్లతోపాటు చేపలు కూడా కొట్టుకొచ్చాయి. ఆ సమయంలో గ్రామాల్లో ప్రతి ఇంటిలో చేపల కూర గుమగుమలే కనిపించాయనడంలో సందేహం లేదు.
రూ.32 వేల కోట్ల సంపద సృష్టి
మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలి. రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెంచి ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ఈ రెండు లక్ష్యాలతో సీఎం కేసీఆర్ ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం ప్రారంభించారు. అనతికాలంలోనే సీఎం కేసీఆర్ లక్ష్యం నెరవేరింది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు రూ.32 వేల కోట్ల విలువైన మత్స్య సంపద సృష్టించడం విశేషం. ఆరేండ్లలో ఈ పథకానికి రూ.344 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం 414 కోట్ల చేప పిల్లలను చెరువులు, కుంటలు, ఇతర జలవనరుల్లో విడిచింది. పంపిణీ చేసిన చేప పిల్లల ద్వారా 22.5 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అయ్యాయి. దీని విలువ అక్షరాల రూ. 32 వేల కోట్లు కావడం గమనార్హం.
తెలంగాణ చేపలకు మస్తు డిమాండ్
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ చేపలు దిగుమతులు చేసుకునే పరిస్థితిలో ఉండేది. మనకు చేపలు దాదాపు ఆంధ్రా నుంచే వచ్చేవి. ఇప్పుడు దేశంలోని అనేక రాష్ర్టాలకు ఎగుమతి చేసే స్థాయికి రాష్ట్రం ఎదిగింది. తెలంగాణ చేపలకు మస్తు డిమాండ్ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ఉచితంగా చేప పిల్లలు వదులుతుండటంతో ఈ నీలివిప్లవం సాకారమైంది. ఎక్కడ చెరువులు, వాగులు, రిజర్వాయర్ల వద్ద చూసినా చేపల జాతరే కనిపిస్తున్నది. సిద్దిపేట జిల్లా ఇప్పుడు ఆంధ్రాకే చేపలను ఎగుమతి చేసే స్థాయికి చేరింది.
– మంత్రి హరీశ్రావు