హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న మూడు జిల్లాల్లో ప్రభుత్వ భూముల విక్రయానికి మంచి డిమాండ్ ఉన్నది. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 38 ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను ఆన్లైన్లో విక్రయించేందుకు హెచ్ఎండీఏ ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేసింది. భూములన్నీ ఔటర్ రింగ్రోడ్డుకు దగ్గరే ఉండటంతో కొనుగోలుదారులు భారీగా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో భూములపై మరింత సమాచారాన్ని ఇచ్చేందుకు, సందేహాలను తీర్చేందుకు ఈ నెల 4, 5, 6 తేదీల్లో ప్రీ బిడ్ సమావేశాలను నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని 13 ల్యాండ్ పార్సిల్స్ విక్రయాలకు వీలుగా బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో ఈ నెల 4న, 5న సంగారెడ్డి జిల్లా రుద్రారం సమీపంలోని గీతం యూనివర్సిటీలో, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు సంబంధించి 6న టూరిజం ప్లాజా హోటల్లో ప్రీ బిడ్ సమావేశాలు నిర్వహించనున్నట్టు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఈ భూముల కొనుగోలుకు ఈనెల 16న సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకొనే అవకాశం ఉన్నది. రిజిస్ట్రేషన్ చేసుకొన్నవారు 17న ధరావతు (ఈఎండీ) చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 18న 38 ల్యాండ్ పార్సిల్స్కు ఆన్లైన్లోనే వేలం నిర్వహిస్తారు. గూగుల్ ఎర్త్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని హెచ్ఎండీఏ జారీ చేసిన నోటిఫికేషన్లో ఇచ్చిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి విక్రయానికి ఉంచిన భూముల వివరాలను గుర్తించవచ్చు. మరింత సమాచారం కోసం హెచ్ఎండీఏ అధికారులను సంప్రదించాలని సూచించారు.