హైదరాబాద్: నేడు మృగశిర కార్తె కావడంతో చేపల మార్కెట్లలో రద్దీ పెరిగింది. చేపల కోసం ప్రజలు పెద్దఎత్తున ఎగబడుతున్నారు. దీంతో హైదరాబాద్లోని రామ్నగర్ చేపల మార్కెట్ కిటకిటలాడుతున్నది. అదేవిధంగా రోడ్లపై చేపల అమ్మకం దారుల వద్ద జనాలు బారులు తీరారు. అయితే మార్కెట్లలో కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించడం లేదు.
మృగశిర కార్తె తర్వాత రోకండ్లను సైతం పగులగొట్టె ఎండలు తగ్గిపోయి వర్షాలు ప్రారంభమవుతాయి. 15 రోజుల పాటు ఈ కార్తె ఉంటుంది. మృగశిర కార్తె చేపలు తినడం అనే సంప్రదాయం మన పూర్వీకుల కాలం నుంచి వస్తున్నది. ఎండకాలం తర్వాత వాతావరణం చల్లబడటంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో వేడి ఉండేందుకు చేపలను తింటారు. దీని వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా మృగశిర కార్తెతో వర్షాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ సీజన్లో చాలా మందికి జీర్ణశక్తితో పాటు రోగ నిరోధక శక్తి తగ్గిపోయి జ్వరం, దగ్గు, ఇతర వ్యాధుల బారిన పడుతుంటారు. వాటినుంచి బయటపడటానికి చేపలు తినాల్సిందే. పూర్వీకులు శాఖాపరమైన ఇంగువను బెల్లంలో కలుపుకొని ఉండలుగా చేసుకుని తినేవారు. మాంసాహారులైతే చేపలను ఇంగువలో, చింత చిరుగులో పెట్టుకుని తినేవారు.