Medaram Jatara | హైదరాబాద్/ములుగు, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక, సారలమ్మ జాతరకు విస్తృ త ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి శాంతికుమారి చెప్పారు. ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే జాతర నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో శనివారం రాష్ట్ర సచివాలయం నుంచి సీఎస్ టెలికాన్ఫరెన్స్ సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ.. జాతరకు ముందుగానే పెద్ద సంఖ్యలో మేడారానికి భక్తులు వస్తున్నారని, జాతర ప్రారంభం నాటికి వారి సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పారు. జాతరలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ బందోబస్తు, చెక్ పోస్టులు ఏర్పాటుచేయాలని సూచించారు. దాదాపు 4,800 సీసీ కెమెరాలను పెట్టనున్న ట్టు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 6 వేల బస్సులను మేడారానికి నడుపుతున్నామని, మేడారంలో 55 ఎకరాల విస్తీర్ణంలో తాతాలిక బస్స్టేషన్ ఏర్పాటు చేశామని, ఈ నెల 18 నుంచి 26 వరకు బస్సులను నడుపుతామని, ఇందుకు 9 వేల మంది సిబ్బందిని నియమించామని వివరించారు. పారిశుద్ధ్య నిర్వహణకు 4000 మంది కార్మికులను నియమించామని సీఎస్ చెప్పారు.
ఆకాశాన్నంటుతున్న ధరలు
రెండేండ్లకోసారి జరిగే మేడారం మహాజాతరను కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. తల్లుల చెంతకు కోట్లాదిగా తరలివచ్చే భక్తులకు కల్తీ వస్తువులను అంటగడుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. బయట మార్కెట్లో చవకగా దొరికే వస్తువులకు.. పదింతలు ధరలు పెంచి భక్తుల జేబులు గుల్లచేస్తున్నారు. నాసిరకం వస్తువులను బ్రాండెడ్ వస్తువులతో సమానంగా ప్యాకింగ్ చేసి దందా కొనసాగిస్తున్నారు. కాలం చెల్లిన వాటర్ బాటిళ్లు, కూల్డ్రింక్లను భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మార్కెట్లో రూ.20కి దొరికే లీటర్ వాటర్ బాటిల్ను రూ.50, రూ.20 లభించే కూల్డ్రింక్ను రూ.50, రూ.20ల కొబ్బరికాయను రూ.50 నుంచి రూ.60 వరకు, రూపాయికి దొరికే పసుపు, కుంకుమ ప్యాకెట్లను పది రూపాయలకు విక్రయిస్తున్నారు.
30 జన్ సాధారణ్ రైళ్లు
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 30 జన్ సాధారణ్ (ప్రత్యేక) రైళ్లను శనివారం ప్రకటించింది.