హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ)/చిక్కడపల్లి: వస్త్ర పరిశ్రమపై జీఎస్టీని 7% పెంచడం వల్ల 95 వేల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎస్ఎంఈ) మూతపడే ప్రమాదం ఉన్నదని రాష్ట్ర పరిశ్రమలు, చేనేత, జౌళిశాఖల మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వస్త్ర ఉత్పత్తుల ఎగుమతులను పది రెట్లు పెంచడం ఎలా సాధ్యమవుతుందని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఎగుమతులు పెంచేందుకు కేంద్రం వద్ద ప్రణాళికలేమిటని కేంద్ర వాణిజ్య, టెక్స్టైల్స్శాఖ మంత్రి పీయూష్గోయల్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. 7 శాతం జీఎస్టీ పెంపుదలతో 95 వేల ఎస్ఎంఈలు మూతపడతాయని క్లాతింగ్ మాన్యూఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విడుదలచేసిన ప్రకటనతోపాటు, వస్త్ర ఉత్పత్తులను పది రెట్లు పెంచుతామంటూ గతంలో పీయూష్గోయల్ ఇచ్చిన ప్రకటనలను ట్వీట్తో జతపర్చారు. నేతన్నల జీవితాల్లో జీఎస్టీ చీకట్లు నింపే ప్రమాదం ఉన్నదని మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. అగ్గిపెట్టెలో, దబ్బనంలో ఇమిడిపోయే చీరలను తయారుచేసిన సిరిసిల్లకు చెందిన వెల్ది హరిప్రసాద్ లాంటి కళాకారుల మీద కూడా జీఎస్టీ ప్రభావం పడే అవకాశం ఉన్నదని మరో ట్వీట్లో పేర్కొన్నారు.