హైదరాబాద్ : నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బొనాంజా ప్రకటించారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి నిన్న సాయంత్రం నుంచి కొనసాగుతున్న ఉత్కంఠకు కేసీఆర్ ఈ ఉదయం 10 గంటలకు తెరదించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పుస్తకాలతో కుస్తీ పడుతున్న విద్యార్థులకు, ఉద్యోగ అభ్యర్థులకు కేసీఆర్ తీపి కబురు అందించారు. 80,039 ఉద్యోగ నియామకాలకు నేటి నుంచే నోటిఫికేషన్లు వెలువడుతాయని శాసనసభా వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అయితే శాఖల వారీగా, జిల్లాల వారీగా ఉద్యోగ ఖాళీలను కేసీఆర్ ప్రకటించారు. 80 వేల ఉద్యోగ ఖాళీలను నేరుగా భర్తీ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఏయే శాఖల్లో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయనే అంశంపై నిరుద్యోగులు ఎంతో ఆసక్తి చూపారు. అయితే హోం, ఎడ్యుకేషన్, హెల్త్ విభాగాల్లో ఉన్న ఖాళీలపై ఉద్యోగ అభ్యర్థులు దృష్టి సారించారు. ఎందుకంటే ఈ మూడు విభాగాల్లోనే దాదాపు 50 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి. ఇక పోలీసు, టీచర్ ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు ఆయా శాఖల్లోని ఖాళీలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు. పోలీసు శాఖలో 18,334 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులను భర్తీ చేసేందుకు ఆ శాఖ నోటిఫికేషన్ను విడుదల చేయనుంది.
ఎడ్యుకేషన్ విభాగంలో.. సెకండరీ ఎడ్యుకేషన్లో 13,086, హాయ్యర్ ఎడ్యుకేషన్లో 7,878 ఖాళీలు ఉన్నాయి. ఇందులో టీచర్ పోస్టులు ఎన్ని అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ప్రాథమిక విద్యలో 10 వేలు, ఉన్నత విద్యలో 2 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. మొత్తంగా 12 వేల వరకు టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ వెలువడనుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్(టీఆర్టీ) ద్వారా 8,792 టీచర్ పోస్టులను టీఎస్పీఎస్సీ భర్తీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి 2017లో నోటిఫికేషన్ వెలువడింది. అయితే అప్పట్లో మొత్తం 13,500 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ 8,792 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలు చేపట్టింది. ఏదేమైనప్పటికీ సీఎం కేసీఆర్ 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడుతాయని ప్రకటించడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి తల్లిదండ్రులు కూడా సంతోషిస్తున్నారు.