హైదరాబాద్, సెప్టెంబర్ 3(నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణపై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. కామారెడ్డి జిల్లా గాంధారీ మండల కేంద్రంలో శనివారం బీజేపీ నేతలు, ఆ పార్టీ అనుబంధ రైతు సంఘం కిసాన్ మోర్చా నేతలతో కలిసి రైతు సమావేశం పేరుతో రాజకీయ డ్రామా రక్తి కట్టించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతుల కోసం చేసిందేమీ లేకపోయినా.. ఎంతో చేసినట్టుగా తమకు తామే గప్పాలు కొట్టుకొంటూ.. చప్పట్లు కొట్టించుకొన్నారు. ఈ సమావేశానికి నిజమైన రైతులెవర్నీ రానివ్వలేదు. మోటర్లకు మీటర్లు, ఎరువుల ధరల పెంపు, ధాన్యం కొనుగోలుకు నిరాకరణ వంటి అంశాలపై కడిగిపారేస్తారన్న భయంతో అసలైన రైతులను దూరం పెట్టారు. వరి సాగుచేయవద్దన్నది కేంద్రం కాదా? దొడ్డు వడ్లు కొనబోమని చెప్పింది కేంద్రం కాదా? మోటర్లకు మీటర్లు పెట్టాలన్నది కేంద్రం కాదా? ఎరువుల ధరలు పెంచింది కేంద్రం కాదా? అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ సమావేశంలో ఆమె చెప్పిన అబద్ధాలు గోబెల్స్ను కూడా సిగ్గుపడేలా ఉన్నాయి.
నిర్మల అబద్ధం : వాస్తవం
రైతుబంధు సరిగ్గా పంపిణీ చేయడం లేదు : నాలుగున్నరేండ్లుగా ప్రతి ఏటా పంట సీజన్ ప్రారంభానికి ముందే రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.5 వేల చొప్పున జమ అవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.57,820 కోట్లు రైతుబంధు కింద రైతులకు అందించింది.
రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెయ్యలేదు : 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక.. 2018 వరకు 35.32 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.16,144 కోట్ల పంట రుణాలను మాఫీ చేసింది. రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇప్పటికే రూ.50వేల లోపు రుణాలు గల 5.42 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.1,207 కోట్లను మాఫీచేసింది. అంటే మొత్తం కలిపి ప్రభుత్వం రూ.17,351 కోట్ల పంట రుణాలను మాఫీ చేసింది.
వరి సాగు చేస్తే ఉరి అన్న రాష్ట్ర ప్రభుత్వం : వరి సాగు చేయకుండా ఇతర పంటలను సాగుచెయ్యాలని కేంద్ర వ్యవసాయశాఖే చెప్పింది. తెలంగాణనుంచి దొడ్డు వడ్లు కొనబోమని స్పష్టంచేసింది. కేంద్రం ఒత్తిడి వల్లే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యామ్నాయ పంటలను సూచించారు. రైతుల తరఫున ఢిల్లీలో పెద్ద పోరాటమే చేశారు. నిర్మలమ్మ మాత్రం అడ్డగోలుగా నిందలు వేశారు.
పీఎం కిసాన్ నిధులు రైతులందరికీ ఇస్తున్నాం : రాష్ట్రంలో ఉన్న రైతులు 65 లక్షల మంది. కిసాన్ నిధులు అందుతున్నది 35 లక్షల మందికి మాత్రమే. అది కూడా రూ.2 వేల చొప్పున 3 విడతల్లో ఇస్తున్నారు. కిసాన్ కింద కేంద్రం ఇప్పటివరకు ఇచ్చింది రూ.7,689 కోట్లు. రాష్ట్రం రైతుబంధు కింద ఇచ్చింది రూ.58 వేల కోట్లు.
రాష్ట్రం మక్కజొన్న వేయొద్దన్నది: రెండేండ్ల క్రితం విదేశాల నుంచి భారీ మొత్తంలో మక్కలు దిగుమతి చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం 50% ఉన్న దిగుమతి సుంకాన్ని 15%కి తగ్గించింది. ఇక్కడ ధర పలికే పరిస్థితి లేకపోవడం వల్లనే సీఎం కేసీఆర్ వద్దని సూచించారు. నిర్మల కేంద్రం నిర్వాకాన్ని కప్పిపెట్టి.. సీఎం కేసీఆర్పై బురదజల్లుతున్నారు.
ఎరువులు తక్కువ ధరకే ఇస్తున్నాం : కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చాక ఎరువుల ధరలు బాగా పెరిగాయి. పొటాష్ ధర గతంలో రూ. 850 ఉంటే రూ. 1700లకు పెంచింది. 24:24:0:18 ధర 1250 నుంచి రూ. 1900లకు పెంచింది. 28:28:0 ధర రూ. 1275 నుంచి రూ.1900లకు పెంచింది.
రైతు సమస్యల పరిష్కారానికి మోదీ కృషి : మోదీ మొదట్నుంచీ అనుసరిస్తున్నదే రైతు వ్యతిరేక విధానాలు. నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులు నిరసించడంతో క్షమాపణ చెప్పి మరీ రద్దుచేశారు. ఎంఎస్పీ హామీ మరిచారు. రైతుల ఆదాయం రెట్టింపు హామీ పక్కకు పోయి.. పెట్టుబడి రెట్టింపైంది. ఎరువులు, విత్తనాలు, డీజిల్ ధరలు పెంచి పెట్టుబడి ఖర్చు పెంచారు. ధాన్యం కొనుగోలు చేయబోమంటూ ప్రకటించారు.