మన జాతీయ గీత రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ అని అందరికీ తెలుసు. ఆ గీతం పూర్తికాగానే చెప్పే ‘జైహింద్’ నినాద సృష్టికర్త మన హైదరాబాదీ అబిద్ హసన్ సఫ్రానీ అని ఎంతమందికి తెలుసు. ‘జై హింద్’ అనేది ‘హిందూస్థాన్కు విజయం’ అనే అర్థాన్నిచ్చే నినాదం. ‘భారతదేశానికి వందనం’ అనే అర్థంకూడా వస్తుంది. ఈ నినాదం ఆ నాటి రాజకీయ ప్రసంగాల్లో ఉద్యమ కేక అయ్యింది. అందరిలో దేశంకోసం పోరాడాలనే స్ఫూర్తిని రగిలించింది.
సయ్యద్ అబిద్ హసన్ సఫ్రాని హైదరాబాద్లో 1911 ఏప్రిల్ 11న జన్మించారు. తండ్రి అమీర్ హసన్, తల్లి ఫఖ్రుల్ హాజయా బేగం. సఫ్రాని తల్లి హాజయా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు. ఆమె ఖిలాఫత్-సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ తల్లి వారసత్వంగా అబిద్ కూడా జాతీయోద్యమ జెండా చేతబట్టారు. శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా మహాత్ముడి పిలుపు మేరకు తన కళాశాల చదువుకు స్వస్తిచెప్పారు. 1931లో సబర్మతి ఆశ్రమం చేరుకున్నారు. కొద్దికాలం తర్వాత అహింసోద్యమం కంటే సాయుధ పోరాటమే సరైన మార్గమనుకున్నారు. నాసిక్ జైలుకు చెందిన రిఫైనరీని నాశనం చేయాలనే లక్ష్యంతో ఏర్పడ్డ దళంతో కలిసి అబిద్ హసన్ పనిచేశారు. ఏడాదిపాటు కారాగార శిక్షకు గురయ్యారు. ఆ శిక్షాకాలం పూర్తికాకముందే గాంధీ -ఇర్విన్ ఒడంబడిక ఫలితంగా అబిద్ జైలునుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ కార్యక్రమాల్లో దాదాపు దశాబ్దంపాటు చురుగ్గా అబిద్ పాల్గొన్నారు. ఆయన ఇంజినీరింగ్ విద్యాభ్యాసం కోసం జర్మనీ వెళ్లారు.
జర్మనీలో అబిద్ హసన్కు సుభాష్ చంద్రబోస్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వల్ల 1942 నుంచి రెండేళ్లు ఆయన నేతాజీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ క్రమంలో అబిద్ పలుదేశాలు చుట్టివచ్చారు. 1943 ఫిబ్రవరి 8న నేతాజీ బెర్లిన్ నుంచి పెనాంగ్ వరకు సాగించిన సాహస జలంతర్గామి ప్రయాణంలో అబిద్ హసన్ సఫ్రాని ఆయన వెంట ఉన్నారు. ఆ సమయంలోనే సైనికులు ఒకరినొకరు పకలరించుకునేందుకు ఏదైనా పదం సూచించాలని నేతాజీ.. అబిద్ ను కోరారు. ఆయన కోరిక మేరకే అబిద్ ‘జై హింద్’ నినాదాన్ని సూచించారు. తర్వాత మన దేశ జాతీయ నినాదంగా ‘జై హింద్ రూపొందింది. ‘జై హింద్’ నినాదమే కాదు.. సుభాష్ చంద్రబోస్ పేరును కూడా మర్చిపోయేలా ‘నేతాజీ’ అనే పదాన్ని అబిద్ జర్మనీలో ఉండగా సృష్టించారు. సయ్యద్ అబిద్ హసన్ సఫ్రాని హైదరాబాద్లో 1984లో కన్నుమూశారు.