హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): ‘ఇదెలా సాధ్యమైంది?! 400 కేవీ సబ్స్టేషన్ను ఇంత తక్కువ స్థలంలో నిర్మించడం ఆశ్చర్యకరం. విలువైన భూములు ఉన్న నగర ప్రాంతాల్లో తక్కువ స్థలంలో ఇలా నిర్మించడం మంచి ఆలోచన. ఈ టెక్నాలజీని మా రాష్ర్టాల్లోనూ పరిశీలిస్తాం..’ ఇదీ హైదరాబాద్ రాయదుర్గంలోని 400 కేవీ సబ్స్టేషన్ను పరిశీలిస్తూ దక్షిణాది రాష్ర్టాల విద్యుత్తు సంస్థల సీఎండీలు, డైరెక్టర్లు, ఉన్నతాధికారులు కురిపించిన ప్రశంస. వీరితోపాటు సెంట్రల్ ట్రాన్స్మిషన్ యుటిలిటీ (సీటీయూ) ఉన్నతాధికారులు, పవర్గ్రిడ్ అధికారులు కలిసి మొత్తం 22 మంది రెండు రోజులపాటు తెలంగాణలో విద్యుత్తు సరఫరా వ్యవస్థను పరిశీలించారు. శనివారం మణికొండ 132 కేవీ ఔట్డోర్ జీఐఎస్ సబ్స్టేషన్ను, అక్కడి నుంచి అప్పా జంక్షన్ వరకు ట్రాన్స్మిషన్ లైన్లను పరిశీలించింది. మోనోపోల్స్ (ఒంటిస్థంభం)ను ఆశ్చర్యంతో చూశారు. ఓఆర్ఆర్ వెంట మల్టీసర్క్యూట్ టవర్స్ను పరిశీలించారు. గచ్చిబౌలి ఓఆర్ఆర్ వద్ద మోనోపోల్ లైన్ నుంచి కేబుల్గా ఎలా చేంజ్ అయ్యిందనేది ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. రాయదుర్గంలోని 400/132/33/11 కేవీ జీఐఎస్ సబ్స్టేషన్ను సందర్శించి సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. 60 నుంచి 70 ఎకరాల్లో నిర్మించే 400 కేవీ సబ్స్టేషన్ను కేవలం 5 ఎకరాల్లో సాకారం చేయడం అద్భుతమని కొనియాడారు. ఇతర రాష్ర్టాలకూ ఆదర్శనీయమని పేర్కొన్నారు. తెలంగాణలో అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలను ఉపయోగించుకుంటున్న తీరును టీఎస్ ట్రాన్స్కో డైరెక్టర్ జగత్రెడ్డి వారికి వివరించారు.
ఇతర రాష్ర్టాల ఉన్నతాధికారుల బృందం ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావుతో విద్యుత్తు సౌధలో సమావేశమైంది. తెలంగాణ విద్యుత్తు వ్యవస్థల బలోపేతం, 24 గంటల విద్యుత్తు సరఫరా, బిల్లింగ్, ట్రాన్స్మిషన్ వ్యవస్థలో ఉపయోగించిన అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలపై చర్చించారు. సందేహాలను ప్రభాకర్రావు నివృత్తి చేశారు. సీఎం కేసీఆర్ విద్యుత్తు రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిన విషయాన్ని వారికి వివరించారు. రాయదుర్గం సబ్స్టేషన్, మోనోపోల్స్, మణికొండ సబ్స్టేషన్, లిఫ్ట్ ఇరిగేషన్లు, 24 గంటల విద్యుత్తు విషయంలో ఆధునిక సాంకేతికను ఉపయోగించిన తీరుకు, సహకరించిన ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు, సీఎండీ ప్రభాకర్రావుకు ఉన్నతాధికారుల బృందం అభినందనలు తెలియజేసింది. ఇలాంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలను తమ రాష్ర్టాల్లోనూ అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఎస్సార్పీసీ సభ్య కార్యదర్శి అసిత్సింగ్, కేఎస్ఈబీఎల్ సీఎండీ రాజన్ కోబ్రగోడె, సెంట్రల్ ట్రాన్స్మిషన్ యుటిలిటీ సీజీఎంలు జస్బీర్సింగ్, సౌరవ్ చక్రవర్తి, జీఎంలు అనిల్కుమార్ మీనా, రాకేశ్కుమార్, కేరళ పవర్ కార్పొరేషన్ ఎండీ క్రిష్ణప్ప, తమిళనాడు ట్రాన్స్కో డైరెక్టర్ సెల్వశేఖర్, కేపీటీసీఎల్ డైరెక్టర్ జైకుమార్, ఏపీ టీ అండ్ జీ డైరెక్టర్ భాస్కర్, పీజీసీఐఎల్ అధికారులు మల్లిఖార్జున్, ఉధాకర్రావు, ఎస్కే శర్మ, నానాజీ తదితరులు ఉన్నారు.