హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): ‘సీనియర్ సభ్యులు, సీఎల్పీ నాయకులైన మీరు కూడా సమయపాలన పాటించకపోతే ఎలా? ఇది మీకు తగునా?’ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సున్నితంగా మందలించారు. శనివారం వివిధ పద్దులపై చర్చ జరుగుతున్న సందర్భంగా తమకు సమయమివ్వాలని, తాము మాట్లాడుతున్న సమయంలో మంత్రులు, ఇతరులు తమ సమయాన్ని వాడుకుంటున్నారని పదే పదే భట్టి విక్రమార్క స్పీకర్ను ఉద్దేశించి పేర్కొన్నారు. దీంతో ‘మమ్ములను కమాండ్ చేస్తున్నారు. ఇది సరికాదు’ అని భట్టికి స్పీకర్ పోచారం సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా 105 మంది సభ్యులున్న బీఆర్ఎస్ ఈ సెషన్స్లో తీసుకున్న టైం 73 గంటల 30 నిమిషాలు అయితే ఐదుగురు సభ్యులున్న కాంగ్రెస్ పార్టీకి 34 గంటల 23 నిమిషాలు ఇచ్చామని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఆధారాలతో సహా భట్టికి చూపారు.