హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరిట బాపూఘాట్ సమీపంలోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ను స్వాధీనం చేసుకుంటామని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా సోమవారం అభ్యంతరాలు తెలిపేందుకు రావాలని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ ఆఫీసులో గ్రామసభ నిర్వహించింది. తమ వినతులు, అభ్యర్థనలు వినకుండా అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధితుల అభ్యర్థనను పట్టించుకోకుండా భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసి రెండు నెలులు పూర్తయినందున మరోసారి సమావేశం నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. సర్వే నంబర్ 89, 90లోని 10.34 ఎకరాలను స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు. తదుపరి నోటీసులు వ్యక్తిగతంగా జారీ చేస్తామని స్పష్టంచేశారు. ఈ క్రమంలో బాధితులు, అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. తమ ఇండ్లను తీసుకునేందుకు అంగీకరించబోమని, డ్రాఫ్ట్ తయారుచేసి తమ అంగీకారం లేకుండా ఎలా నిర్ణయిస్తారని బాధితులు ఆందోళన చేయగా పోలీసులు వారిని పంపించేశారు.
అధికారులపై ఆగ్రహం
గ్రామసభలో తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని మధు పార్క్ రిడ్జ్ నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కుతూ కాంగ్రెస్ ప్రభు త్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నదని, పరిహారం విషయంలో ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడు తూ భయాందోళనలకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. ఒకసారి ఫ్లాట్కు ఫ్లాట్ ఇస్తామని, మరోసారి భూమికి భూమి ఇస్తామని చెప్తూ ఇప్పుడు అవేమీ లేకుండా నోటిఫికేషన్ ప్రకారమే ముందుకెళ్తామని చెప్తుండటం ఏమిటని నిలదీశారు. ప్రాజెక్టుపై కనీస అవగాహన లేకుండా బాధితులను మానసికంగా వేధిన్నారని ఆందోళన వ్యక్తంచేశారు. భూసేకరణ నిబంధనలను పాటించకుండా తదుపరి నోటీసులు జారీ చేస్తామని ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. ప్రభుత్వ ఏకపక్ష ధోరణికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. మధు పార్క్ రిడ్జ్ నివాసితులు ఆదిత్య, గిరిబాబు మాట్లాడుతూ రేవంత్రెడ్డి ప్రజాపాలన పేరుతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని, ప్రజాపాలన అంటే ప్రజలకు కష్టాలు రాకుండా చూసుకోవాలి కానీ, సీఎం నిరంతరం ప్రజలు భయంగుప్పిట్లో బతికేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓసారి మధు పార్క్ రిడ్జ్ తమకు అవసరం లేదని స్వయంగా సీఎం ప్రకటించారని, ఇప్పుడు అధికారులు గ్రామసభ పెట్టి తమ అభిప్రాయాలు అడుగుతున్నారని, అసలు ప్రభుత్వ నిర్ణయం ఏమిటో అర్థం కాకుండా ఉన్నదని వాపోయారు.