హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): అనాలోచిత నిర్ణయాలతో సెప్టెంబర్లో ఒకసారి ప్రయత్నించి చేతులు కాల్చుకున్న ప్రభుత్వం తాజాగా మళ్లీ మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సమాయత్తమవుతున్నది. నాటి అడ్డంకులు పూర్తిగా తొలగిపోనప్పటికీ, ఎన్నిక ల నిర్వహణకు సిద్ధం కావాలన్న ప్రభుత్వ సంకేతాలతో ఎస్ఈసీ కూడా సన్నద్ధమవుతున్నది. తొలుత ఈ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం లేవనెత్తిన బీసీ రిజర్వేషన్ల అంశమే ప్రధాన సమస్యగా మారిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఈ వివాదం పరిష్కారం కాకముందే ముందుకు వెళ్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు, బీసీ రిజర్వేషన్ల శాతంపై హైకోర్టులో కేసు తేలాల్సి ఉన్నది. బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయడం, న్యాయపరమైన చిక్కులను అధిగమించడం ప్రభుత్వానికి కత్తిమీద సాముగా మారింది. ఇవి పరిష్కరించకుండా ఎన్నికలకు ఎలా వెళ్తారనేది ఉత్కంఠ రేకెత్తిస్తుండగా, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం చేసిన సూచనలు అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. దీంతో మరోసారి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
23న క్యాబినెట్లో నిర్ణయం!
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు చివరిసారిగా 2019 మేలో జరిగాయి. 2019 మే 6, 10, 14వ తేదీల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి, జూన్లో ఎంపీపీలు, జడ్పీ చైర్మన్ల ను ఎన్నుకున్నారు. గత సంవత్సరం జూన్లో వారి పదవీకాలం ముగిసింది. నాటినుంచి స్పె షల్ ఆఫీసర్ల పాలనతో నెట్టుకొస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 29న రెండు దశల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీచేసి నామినేష న్లు స్వీకరించారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణలో భాగంగా అక్టోబర్ 9న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత న్యాయస్థానం అనుమతితో ప్రభుత్వం గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించింది. రిజర్వేషన్ల విధానం ప్రకటించిన అనంతరం అందుకు అనుగుణంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 23న క్యాబినెట్లో చర్చిం చి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నది. మంత్రివర్గ సమావేశంలో రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని, ఇదే విషయాన్ని హైకోర్టుకు నివేదించనున్నట్టు తెలిసింది. ఈలోగానే ఎన్నికల ప్రక్రియలో వేగం పెంచేందుకుగాను గత సంవత్సరం జూలై 10వ తేదీ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 5 నాటికి కేంద్ర ఎన్నికల సంఘం సవరించిన జాబితాతో నియోజకవర్గాల వారీగా అదనపు ఓటర్ల వివరాలను మండలాల వారీగా గుర్తిస్తున్నారు. వీటి ఆధారంగానే తుది ఓటర్ల జాబితా ఖరారు చేసి ఎన్నికలను ప్రామాణికంగా తీసుకోనున్నారు. అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 23ను గడువుగా నిర్దేశించారు. ప్రభుత్వ ఆమోదం తర్వా త జాబితాలను క్షేత్రస్థాయిలో ప్రదర్శిస్తారు. ఇదే జాబితాతో ఎన్నికలకు వెళ్లనున్నారు.
తగ్గిన ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు
ప్రభుత్వ ఆదేశాలతో సంబంధిత శాఖలు ప్రక్రియను ప్రారంభించి 5,773 ఎంపీటీసీ, 566 జడ్పీటీసీ స్థానాల ఎన్నికల నిర్వహణకు వీలుగా జాబితాను సిద్ధంచేసి సీఎస్కు సమర్పించారు. సీఎస్ ఈ నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు. ఈ ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల తగ్గుదల వెనుక మేడ్చల్-మల్కాజిగిరిని అర్బన్ జిల్లాగా గుర్తిం చి జిల్లా పరిషత్ జాబితా నుంచి తొలగించడంతోపాటు, పలు జిల్లాల్లో మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో కొన్ని గ్రామాలు విలీనం కావ డం కారణం. ప్రస్తుతం రాష్ట్రంలో 31 జిల్లా పరిషత్లు ఉన్నాయి. 2019 తర్వాత సమీప మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అనేక గ్రామ పంచాయతీల విలీనంతో 44 ఎంపీటీసీలు, నాలుగు జడ్పీటీసీ, మరో 4 ఎంపీపీ స్థానాలు తగ్గిపోయాయి. ఎన్నికలకు వెళ్లాలంటే ముందు గా బీసీ రిజర్వేషన్లపై న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాల్సి ఉన్నది. దీనిపై ప్రభుత్వం ఎటువంటి కసరత్తు చేయలేదు. ప్రస్తుతం రిజర్వేషన్ల వివాదం హైకోర్టు లో విచారణలో ఉన్నది. తాజాగా అదనపు ఓటర్ల వివరాలను మండలాల వారీగా గుర్తించి పోలింగ్ కేంద్రాల వారీగా జత చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే జరిగితే తీవ్రమైన ఎండలు ఠారెత్తించే మే నెలలో ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. పోలింగ్ శాతం తగ్గడం, వేసవిలో నీటి ఎద్దడి, కరువు పరిస్థితుల వంటివి కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నది.