హైదరాబాద్, ఆగస్ట్ 12 (నమస్తే తెలంగాణ): సీమ ఎత్తిపోతల సందర్శనలో తెలంగాణ అధికారులను అనుమతించని కేఆర్ఎంబీ.. తమ వెంట ఏపీ అధికారులను ఎలా అనుమతించిందని తెలంగాణ ప్రభుత్వం నిలదీసింది. కేఆర్ఎంబీ బృందంపై ఏపీ అధికారుల ప్రభావం పడుతుందని, నివేదిక నిష్పక్షపాతంగా వస్తుందా? అన్న దానిపై సందేహాన్ని వ్యక్తంచేసింది. ఈ మేరకు కేంద్ర జల్శక్తిశాఖ, కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్కు గురువారం తెలంగాణ సాగునీటిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ లేఖ రాశారు.
ఈ నెల 5న ప్రాజెక్టును సందర్శించాల్సిన కేఆర్ఎంబీ బృందంలో సీడబ్ల్యూసీ ఇంజినీర్ దేవేందర్రావు ఉండటంపై ఏపీ అభ్యంతరం వ్యక్తంచేసింది. దేవేందర్రావు తెలంగాణకు చెందిన వ్యక్తి అని, ఆయనను ప్రాజెక్టు సందర్శన బృందం నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. దీంతో తెలుగు రాష్ర్టాలతో సంబంధం లేని కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ డీఎం రాయపురే, మెంబర్ (పవర్) మౌతంగ్తోపాటు సీడబ్ల్యూసీ డైరెక్టర్ తల్వార్ బృం దం బుధవారం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లింది. ముచ్చుమర్రికి వెళ్లిన బృందం అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ, సీమ ఎత్తిపోతల పథకం పనులు సాగుతున్న ప్రాంతాన్ని సందర్శించింది. ఈ బృందం తమ వెంట ఏపీ జలవనరులశాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి, ఇతర అధికారులను అనుమతించడం చర్చనీయాంశంగా మారింది.
సీమ ఎత్తిపోతలపై ఏపీ అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను కేఆర్ఎంబీ బృందం వీక్షించింది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీ చైర్మన్కు లేఖ రాసింది. రాయలసీమ, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీపై ఫిర్యాదు చేసిన తెలంగాణ ప్రభుత్వాన్ని కాదనడంపై మండిపడింది. ఏపీ ప్రాజెక్టులపై పూర్తి అవగాహన ఉన్నదని, పరిశీలన బృందానికి ఆయా అంశాలను వివరించేందుకు అనుమతివ్వాలని కోరిన తమను కాదని.. ఏపీ అధికారులను అనుమతించడం ఏమిటని నిలదీసింది.