పెద్దవాగుపై నాలుగు చోట్ల నిర్మాణం
ఇప్పటికే మూడు చోట్ల పూర్తి..
ఇక ఏడాది పొడవునా పుష్కలంగా నీరు
భూగర్భ జలాల పెరిగే అవకాశం
ఇక పంటలకు ఢోకా లేదంటున్న రైతాంగం
బోథ్, జూలై 4 : చెక్డ్యాంల నిర్మాణంతో జలకళ సంతరించుకున్నది. పెద్దవాగులో కిలోమీటర్ల పొడవునా నీరు నిలిచి ఉంది. భూగర్భ జలాలు పెరుగుతుండగా, ఇక పంటలకు ఢోకా లేకుండా పోతున్నది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పెద్దవాగుపై చెక్ డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ. 9.40 కోట్ల నాబార్డు (కాళేశ్వరం) నిధులు మంజూరు చేసింది. కుచ్లాపూర్ క్రాస్ రోడ్డు సమీపంలో, పొచ్చెర దర్గా వద్ద, కన్గుట్ట పెద్దవాగు వంతెన సమీపంలో చెక్డ్యాంలకు రూ. 2.50 కోట్ల చొప్పున, బోథ్-జీడిపల్లె వంతెన సమీపంలో పెద్దవాగుపై చెక్ డ్యాంకు రూ.1.90 కోట్లు మంజూరు చేసింది. కుచ్లాపూర్ క్రాస్రోడ్డు, పొచ్చెర దర్గా వద్ద నిర్మించిన చెక్ డ్యాంలు పూర్తయ్యాయి. బోథ్-జీడిపల్లె వంతెన సమీపంలో నిర్మిస్తున్న చెక్ డ్యాం పనులు పూర్తికావస్తున్నాయి. కన్గుట్ట పెద్దవాగు వద్ద చేపట్టిన పనులు వర్షాకాలం ఆరంభంతో నిలిచిపోయాయి. ఆయాచోట్ల వాగులో 60 నుంచి 90 మీటర్ల పొడవుతో అడ్డుకట్ట కట్టారు. వాగులో నాలుగు మీటర్ల ఎత్తులో కట్ట నిర్మించారు. అంతవరకు నీరు నిలిచి ఉండి మిగతా నీరు వాగులో పారే విధంగా అలుగు ఏర్పాటు చేశారు.
చెక్ డ్యాం కట్టిన చోట వాగుకు ఇరువైపులా 200 మీటర్ల నుంచి 400 మీటర్ల వరకు బండరాళ్లతో రివిట్మెంట్ కట్టించారు. పక్కనున్న పొలాల్లోకి వాగు నీరు వెళ్లకుండా ఏర్పాట్లు చేశారు. వర్షాకాలం మొదలవడంతో ఒకటి, రెండు వర్షాలకే చెక్ డ్యాంలు నిర్మించిన చోట నీరు పుష్కలంగా నిలిచి ఉంది. 3 ఎంసీటీఎఫ్ (మిలియన్ క్యూబిక్ ఫీట్) నీరు చెక్డ్యాంల వద్ద అందుబాటులో ఉంది. కట్ట నుంచి సుమారు 900 మీటర్ల నుంచి కిలోమీటర్ వరకు బ్యాక్ వాటర్ నిలిచి పెద్దవాగు జలకళతో ఉట్టిపడుతున్నది. చెక్డ్యాం నిర్మాణంతో బోథ్ (కరత్వాడ)ప్రాజెక్టు నిర్మించిన స్థలం నుంచి పొచ్చెర జలపాతం వరకు సుమారు ఏడు కిలోమీటర్ల మేర పెద్దవాగులో ఏడాది పొడవునా నీరు నిలిచి ఉండే పరిస్థితి ఏర్పడింది. పెద్దవాగులో నీటి నిలువతో బోథ్, కుచ్లాపూర్, కన్గుట్ట, కౌఠ (బీ), పొచ్చెర గ్రామాల రైతులకు భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల్లో నీరు సమృద్ధిగా వచ్చే అవకాశం కలగనున్నది. మరోవైపు పెద్దవాగుకు ఇరువైపులా పొలాలున్న రైతులు మోటార్లు, ఆయిల్ ఇంజన్ల సహాయంతో పంటలకు నీటి తడులు అందించుకునే వీలు కలుగనున్నది.
ఏడాది పొడవునా నీరు
ప్రభుత్వం నాలుగు చెక్ డ్యాంలు మంజూరు చేసింది. మూడు పూర్తయ్యాయి. మరొకటి వర్షాకాలం పూర్తయ్యాక నిర్మాణం పూర్తి చేయిస్తాం. ఈ వాగుపై మరో రెండు చెక్డ్యాంల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం. అవి వచ్చే అవకాశం ఉంది. చెక్డ్యాంలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మండు వేసవిలోనూ వాగు జీవనదిగా పారనున్నది.
-భీంరావు, డీఈఈ, చిన్ననీటి పారుదల శాఖ, ఇచ్చోడ సబ్ డివిజన్
మా పంటలకు ఢోకా ఉండదు
పెద్దవాగుపై చెక్ డ్యాంల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరు గుతాయి. వేసవిలో వాగు ఎండిపోయేది. ఇప్పుడు కట్టిన చోట నుంచి కిలోమీటర్ వరకు నీరు నిలిచి ఉంది. భూగర్భ జలాలు పెరుగుతాయి. వాగు పక్కను న్న మా పంటలకు ఇక ఢోకా ఉండదు. -గడ్డం దివాకర్రెడ్డి, రైతు, పొచ్చెర