హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థ పురోగమనానికి టీబీజీకేఎస్ గెలుపు చాలా అవసరమని, సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండాఎగరటం ఖాయమని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కార్మికుల హక్కులు, ప్రయోజనాల సాధనకు సంస్థను నిద్రపోనివ్వబోమని సింగరేణి అంటే సింహగర్జన అని, అదే స్ఫూర్తితో పనిచేస్తూ సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో టీబీజీకేఎస్ సంఘం నాయకులు, ముఖ్య కార్యకర్తలు గురువారం హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవిత నివాసంలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ సాధనలో బొగ్గు గని కార్మికులు ప్రధాన భూమిక పోషించారని, సింగరేణి కార్మికులకు ఉన్న పోరాట స్ఫూర్తి జాతీయ సంఘాలకు లేదని స్పష్టం చేశారు. గనుల్లో కార్మికులు చేస్తున్న కష్టం, చిందిస్తున్న చెమట తెలంగాణలో వెలుగులు నింపుతున్నదని, ఈ క్రమంలో ధైర్యంగా పోరాటం చేయాలని ఆమె దిశానిర్దేశం చేశారు. అధికారం ఉన్నా లేకపోయినా తెలంగాణ కోసం పోరాటం చేసి సాధించామని, ఈ సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరేస్తామనటంలో ఎలాంటి సందేహం లేదని తేల్చిచెప్పారు. ఎన్నికల్లో ఒకొకరు ఒకో కేసీఆర్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. మ్యానిఫెస్టో కమిటీని ఏర్పాటు చేస్తామని, దాన్ని అతిత్వరలో విడుదల చేస్తామని ప్రకటించారు.
ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ వంటి జాతీయ సంఘాలు సింగరేణి హకులను ఏనాడూ కాపాడలేదని, భవిష్యత్తులోనూ సంఘాలు సింగరేణి ఎదుగుదల కోసం ఏమీ చేయబోవని కవిత విమర్శించారు. టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉండగా ఒక సమ్మె కూడా చేసే అవసరం లేకుండా అన్ని పనులను సాధించి పెట్టామని తెలిపారు. సింగరేణి అంటే తమకు ప్రాధాన్యం ఉందని, కానీ కాంగ్రెస్ ప్రాధాన్యాల్లో సింగరేణి, ఆ సంస్థ కార్మికులు లేరని తేల్చిచెప్పారు. ఏ అధికారం లేనప్పుడే తెలంగాణ సాధించామని, అలాంటిది కార్మికుల హకులు, ప్రయోజనాలు సాధించడానికి సింగరేణి సంస్థ యాజమన్యాన్ని నిద్రపోనివ్వబోమని స్పష్టం చేశారు. తమకు పోరాటాలు కొత్తకాదని, కార్మికుల హకులను సాధించే వరకు విశ్రమించబోమని, కార్మికుల పక్షాన ప్రతి నిత్యం నిలబడి ఉంటామని పునరుద్ఘాటించారు.
సింగరేణిలో 40 వేల మంది ఉద్యోగులు ఉంటే 21 వేల మంది యువకులే ఉన్నారని కవిత పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంఘం నాయకత్వ బాధ్యతల్లో యువతకు ప్రాధాన్యం ఇస్తామని, సింగరేణిని నడపటంలో వారిని చోదకశక్తిగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అన్ని కమిటీల్లోనూ యువతకు ప్రాధాన్యం ఇస్తామని, మహిళలకు కూడా అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. డిపెండెంట్ ఉద్యోగాల కోసం బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ తీవ్రంగా కృషి చేశారని గుర్తు చేశారు. డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కొంత మంది కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా, అధికారులు కుదరదని చెప్పినా, కేసీఆర్ నిబంధనలను సవరించి వీలైనంత ఎకువ మందికి ఉద్యోగాలు వచ్చేలా చర్యలు చేపట్టారని వివరించారు. కార్మికులు ఆర్థికంగా ఎదిగేలా చేయడమే కాకుండా ఆత్మగౌరవం ఇవ్వాలనే ఆలోచనతో అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. సంస్థ పనితీరును మెరుగుపర్చడానికి, కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ చేసిన మంచిపనులను కార్మికులకు సరిగ్గా వివరిస్తే టీబీజీకేఎస్కు ఎదురుండదని పేర్కొన్నారు.