హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): పంటల రక్షణ కోసం ఉపయోగించే పురుగుమందులు తేనెటీగలను అంతం చేస్తున్నాయని జీవవైవిధ్య శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆ పురుగుమందుల కారణంగా తేనెటీగలు పూల సువాసనలను గుర్తించలేకపోతున్నట్టు పలు పరిశోధనల్లో వెల్లడైంది. బ్రిటన్లో పదేండ్లలో 13 తేనెటీగల జాతులు అంతరించిపోగా, మరో 35 జాతులు ప్రమాదంలో ఉన్నాయని ఆ దేశ వ్యవసాయ విభాగం ఆందోళన వ్యక్తంచేసింది. ఇందుకు పంటలకు వాడుతున్న నికోటినాయిడ్స్ కారణమని వెల్లడించింది. గత శతాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా 18 జాతులు పూర్తిగా కనుమరుగైపోయాయని, మరో 180 జాతులు అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ క్యూరేట్ (ఐయూసీఎస్) ప్రకటించింది.
యుద్ధప్రాతిపదికన తేనెటీగల సంతతిని పెంచకపోతే సమీప భవిష్యత్తులో ప్రపంచం ఆహార కొరతను ఎదుర్కొనక తప్పదని హెచ్చరించింది. పూల పరాగ సంపర్కానికి తేనెటీగల అవసరాన్ని గుర్తించిన యూరోపియన్ యూనియన్ 2018 మే లో నికోటినాయిడ్స్పై నిషేధాన్ని విధించింది. ప్రపంచ జనాభాకు అవసరమైన ఆహార ధా న్యాల కొరతను తగ్గించాలంటే తేనెటీగల సం ఖ్య పెరగాలని, ఇందుకు రసాయన పురుగు మందుల వాడకాన్ని తగ్గించడం ఒక్కటే పరిష్కారమని 2019లో చైనాలో జరిగిన ఐక్యరాజ్యసమితి బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ (కాఫ్-15) సద స్సు పేర్కొన్నది.
తేనెటీగల ఆవాసాలను రక్షించడానికి, ప్రభుత్వాలు, సంస్థలు, పౌరసమాజాన్ని చైతన్యం చేసి ప్రోత్సహించడానికి ఐక్యరాజ్యసమితి ఏటా మే 20న తేనెటీగల దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రకటించింది. తేనెటీగలు ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతకు దోహదం చేస్తున్నాయి. ఏటా 1.77 మిలియన్ మెట్రిక్ టన్నుల తేనెను మనకు అందిస్తున్నాయి.