గోదావరిఖని, అక్టోబర్ 9: సకల సౌకర్యాలతో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిర్మించిన వన్టౌన్ పోలీస్స్టేషన్, పోలీస్ గెస్ట్హౌస్, అంతర్గాం కొత్త పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 11న హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే చందర్ పాల్గొననున్నారు. గోదావరిఖనిలోని వన్టౌన్ పోలీస్ స్టేషన్కు నిత్యం వందలాది మంది వస్తుంటారు. అందుకు తగ్గ సౌకర్యాలు లేకపోవడంతో వసతులు కల్పించాలనే ఉద్దేశంతో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే స్పందించి సింగరేణి యాజమాన్యం నుంచి రూ.3.5 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతో వన్టౌన్ మాడల్ పోలీస్స్టేషన్ను ప్రస్తుత స్థలంలోనే మూడు అంతస్తుల్లో నిర్మించారు. ఒకేసారి వంద మంది కూర్చునేలా భారీ హాల్, విశాలమైన డైనింగ్ హాల్, పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక గదులు, యోగా హాల్, గెస్ట్ రూం, లైబ్రరీ, మంచినీటి సౌకర్యం కల్పించారు. వాహనాల పార్కింగ్కు ఏర్పాట్లు చేశారు. అలాగే ఉన్నతాధికారులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు సమావేశాలు, బస చేసేందుకు అతిథి గృహం నిర్మించేందుకు సాయం చేయాలని మంత్రి కేటీఆర్ను కోలేటి దామోదర్ కోరారు. దీంతో ఎన్టీపీసీ సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.3.4కోట్లు మంజూరు చేశారు. పాత డిగ్రీ కాలేజీ మైదానంలో సకల వసతులతో పోలీస్ అతిథి గృహం, వెల్ఫేర్ సెంటర్ను నిర్మించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పడిన అంతర్గాం మండలంలో రూ.1.5 కోట్ల ప్రభుత్వ నిధులతో కొత్త పోలీస్ స్టేషన్ నిర్మించారు.
సీఎం కేసీఆర్ కృషితోనే గుర్తింపు
రామగుండం జిల్లా కేంద్రం కాకపోయినా సీఎం కేసీఆర్ పోలీసు కమిషనరేట్ను ఏర్పాటు చేయించారు. సింగరేణి, ఎన్టీపీసీ యాజమాన్యాలను ఒప్పించి మాడల్ ఠాణా, పోలీస్ అతిథిగృహాన్ని నిర్మించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఈ ప్రాంతానికి చెందిన నాకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటా.
– కోలేటి దామోదర్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్