హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ)/ మాదన్నపేట: ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకొని రావడంతోపాటు వారి నుంచి సంపద సృష్టించేందుకు తెలంగాణ జైళ్ల శాఖ అనుసరిస్తున్న విధానాలు, చేపట్టిన సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. సోమవారం ఆయన చంచల్గూడ జైలులో ఢిల్లీ జైళ్ల శాఖకు చెందిన వార్డర్స్ పాసింగ్ఔట్ పరేడ్లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. మన జైళ్ల శాఖ చేపట్టిన సంస్కరణలను అధ్యయనం చేసేందుకు వివిధ రాష్ర్టాల జైళ్ల డీజీలు, ఐజీలు వస్తున్నారని వెల్లడించారు. తెలంగాణలోని జైళ్లలో దేశంలో ఎక్కడాలేని విధంగా అత్యుత్తమ సేవలు అందుతున్నాయని చెప్పారు.
పోలీసింగ్లోనూ ఆదర్శంగా నిలిచిందని, సీఎం కేసీఆర్ పాలన దేశానికి ఆదర్శమని కొనియాడారు. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ జితేందర్ మాట్లాడుతూ.. ఖైదీల్లో పరివర్తన తెచ్చేందుకు జైలు సిబ్బంది నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఖైదీల పట్ల మానవతా దృక్పథాన్ని ప్రదర్శించాలని కోరా రు. ఢిల్లీకి చెందిన 130 మంది వార్డర్స్కు 7 నెలలపాటు శిక్షణ ఇచ్చినట్టు తెలంగాణ జైళ్ల శాఖ ఐజీ రాజేశ్ తెలిపారు. వీరిలో 8 మంది మహిళలు ఉన్నారని చెప్పారు. పాసింగ్ పరేడ్ అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన వార్డర్స్కు మెడల్స్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీఐజీలు శ్రీనివాస్, మురళీబాబు, జైళ్లశాఖ ట్రైనింగ్ అకాడమీ ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి, చర్లపల్లి, చంచల్గూడ జైళ్ల సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.