హైదరాబాద్ : సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్పేట డెక్కన్ స్టోర్లో జరిగిన భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న హోంమంత్రి మహమూద్ అలీ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంటలార్పేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్లాస్టిక్ వస్తువులు, రసాయనాల వల్లే మంటల ఉధృతి ఎక్కువగా ఉందని, ప్రస్తుతానికి 80శాతం మంటలు తగ్గుముఖం పట్టాయన్నారు.
మంటలు మరో గంట వరకు అదుపులోకి వస్తాయని పేర్కొన్నారు. అగ్నిప్రమాదంలో ఎవరూ చనిపోలేదని, ఇద్దరి ఆచూకీ మాత్రం తెలియడం లేదన్నారు. మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మంటలు తగ్గిన తర్వాత ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు. భవిష్యత్తులో ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదంలో కాలనీ వాసులు నష్టపోతే ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. భవన యజమానిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదిలా ఉండగా.. ఉదయం 11.30 గంటలకు అగ్ని ప్రమాదం జరిగిన విషయం విషయం తెలిసిందే. ఇప్పటి వరకు భవనంలో మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. డెక్కన్ స్టోర్ భవనం ప్రమాదకర స్థితిలోకి చేరుకున్నది. మంటల ధాటికి భవనంలోపల మూడు, నాలుగు అంతస్తులు కూలిపోయాయి. రెగ్జిన్ మెటీరియల్స్ మంటల్లో తగలబడుతున్నాయి. అలాగే కార్లకు సంబంధించిన మెటీరియల్స్ సైతం అగ్నికి ఆహుతయ్యాయి. ఫైబర్, సింథటిక్ మెటీరియల్స్ కారణంగా రెండు స్లాబులు కుప్పకూలాయి. ఓ వైపు అగ్నిమాపక సిబ్బంది మంటలు అర్పేందుకు ప్రయత్నిస్తుండగా.. మరో వైపు భవనంలో స్లాబులు కూలుతుండడం స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.