మణికొండ, మార్చి 24: దేశంలోనే అత్యుత్తమ పోలీసింగ్ సేవలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగిలో నూతన పోలీస్స్టేషన్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉన్నదని తెలిపారు. నేరాల నియంత్రణకు పోలీసింగ్ సేవలకు ఆధునికతను జోడించి ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. జపాన్ పోలీస్ వ్యవస్థను మించిన స్థాయిలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఉన్నదని వివరించారు. అందుకు సాక్ష్యమే రూ.580 కోట్లతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ అని చెప్పారు. ఉమ్మడి పాలనలో ఒక కమిషనరేట్ మాత్రమే ఉండేదని, ఇప్పుడు 9 కమిషనరేట్లు ఉన్నాయని తెలిపారు. మహిళలకు రక్షణగా షీ టీంలు, షీ పోలీస్ స్టేషన్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలెటి దామోదర్ గుప్తా, ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, కాలే యాదయ్య, జిల్లా పరిషత్తు చైర్పర్సన్ అనితా హరినాథ్రెడ్డి, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
నార్సింగి నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో నిర్మించింది. ఠాణా పరిధిలోని అన్ని గ్రామాలు, వార్డులలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ను పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేశారు. ఏసీపీ, సీఐలకు ప్రత్యేక గదులు నిర్మించారు. ఫిర్యాదుల కౌంటర్, ప్రత్యేక రిసెప్షన్, మహిళలకు ప్రత్యేక కౌన్సిలింగ్ గదులు, రాత్రివేళల్లో విధులు నిర్వహించే కానిస్టేబుళ్లకు విశ్రాంతి గదులు, సువిశాలమైన ప్రాంగణం, పార్కింగ్ వసతులు, ఫిర్యాదుదారులకు ప్రత్యేక సిట్టింగ్ గదులు ఉన్నాయి.