బన్సీలాల్పేట, అక్టోబర్ 8: ఇంతకాలం ప్రైవేట్ రంగానికే పరిమితమైన ఐవీఎఫ్ సంతాన సాఫల్య కేంద్రాలు ఇప్పుడు ప్రభుత్వ దవాఖానల్లోనూ అందుబాటులోకి వస్తున్నాయి. హైదరాబాద్ గాంధీ దవాఖానలో రూ.5 కోట్లతో ఏర్పాటుచేసిన ఐవీఎఫ్ కేంద్రాన్ని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఆదివారం ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రభుత్వరంగంలో ఏర్పాటైన తొలి ఐవీఎఫ్ కేంద్రం ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. నిరుపేద దంపతులకు సంతానం లేదనే బాధ నుంచి విముక్తి కలిగించడానికి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మూడు దవాఖానల్లో ఐవీఎఫ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు. గాంధీతోపాటు పేట్లబుర్జు, వరంగల్ ఎంజీఎం దవాఖానల్లో వీటిని ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.15 కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. దీంతో ప్రైవేట్లో లక్షల్లో ఖర్చయ్యే వైద్యం పేదలకు ఉచితంగానే అందుబాటులోకి వస్తున్నదని తెలిపారు.
టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మాతా, శిశు సంరక్షణ కోసం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 70 శాతానికి పెరిగాయని వివరించారు. గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు మాట్లాడుతూ.. 2018 నుంచే గాంధీ దవాఖానలో ఐయూఐ విధానం ద్వారా సంతాన సాఫల్య కేంద్రం నిర్వహిస్తున్నామని, మందులు వాడటం వలన ఇప్పటివరకు రెండు వందల మహిళలకు సంతానం కలిగిందని చెప్పారు. నూతన ఐవీఎఫ్ కేంద్రంలో కృత్రిమ సంతానోత్పత్తి సేవలను అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతాశోభన్రెడ్డి, బన్సీలాల్పేట కార్పొరేటర్ కే హేమలత, ఇన్చార్జి డీఎంవో డాక్టర్ వాణి, ఉస్మానియా, పేట్లబుర్జు, సుల్తాన్బజార్ దవాఖానల సూపరింటెండెంట్లు డాక్టర్ నాగేందర్, డాక్టర్ రాజ్యలక్ష్మి, డాక్టర్ మాలతి, గాంధీ మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణమోహన్, గైనకాలజీ హెచ్వోడీ డాక్టర్ షర్మిల, ఐవీఎఫ్ కేంద్రం ఇన్చార్జి డాక్టర్ జానకి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.