హైదరాబాద్/రవీంద్రభారతి ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి సీఎం రేవంత్రెడ్డి పూర్తి సానుకూలంగా ఉన్నారని, ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని సీనియర్ పాత్రికేయుడు కే శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. గురువారం ఆయన తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. బషీర్బాగ్ ప్రెస్క్లబ్లోని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. రెండ్రోజుల క్రితం తాను సీఎంను కలసినప్పుడు రాష్ట్రంలోని జర్నలిస్టుల ఇండ్లస్థలాల గురించి చర్చించినట్టు చెప్పారు. జర్నలిస్టుల సమస్యలపై సీఎంకు పూర్తి అవగాహన ఉన్నదని తెలిపారు. హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ సభ్యులకు తొలి ప్రాధాన్యంగా ఇండ్లస్థలాలు ఇస్తామని చెప్పారు.
రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్, ఇంటి స్థలం, హెల్త్కార్డు వచ్చేలా కృషి చేస్తానని, ఈ హెల్త్కార్డులు అన్ని దవాఖానల్లో చెల్లుబాటయ్యేలా చూస్తానని చెప్పారు. సీఎం అధ్యక్షతన వారంలోగా జరిగే సమావేశంలో అన్ని విషయాలు చర్చిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీఎం సీపీఆర్వో అయోధ్యరెడ్డి, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంతరావు, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తి, ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకులు శ్రీనివాస్, సి యాసత్ దినపత్రిక సంపాదకులు అమీర్ అలీఖాన్, మీడియా అకాడమీ సెక్రటరీ నాగులపల్లి వెంకటేశ్వరరావు, టీయూడబ్ల్యూజే నాయకుడు విరాహత్ అలీ, సీపీఐ జాతీయ నాయకుడు కే నారాయణ, రాష్ట్ర నాయకులు పల్లా వెంకట్రెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు.