హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో 49 ఎకరాల ‘పైగా’ భూముల విషయమై ఏకంగా న్యాయస్థానాన్నే మోసగించేందుకు ప్రయత్నించిన హైదరాబాద్ వాసులు యాహిరా ఖురేషీ, మహమ్మద్ మొయినుద్దీన్పై క్రిమినల్ కేసు నమోదుకు హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వాలని హెచ్ఎండీఏ కోరింది. ఈ మేరకు హెచ్ఎండీఏ దాఖలు చేసిన అఫిడవిట్తోపాటు ఆ ఇద్దరు వ్యక్తులు దాఖ లు చేసిన పిటిషన్లపై హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.
‘పైగా’ భూముల వ్యవహారంలో హైకోర్టు 1998లో తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్టు తప్పుడు పత్రాలను సమర్పించారని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పైపెచ్చు కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదంటూ అధికారులపై ధిక్కార పిటిషన్లు వేసినట్టు తెలిపారు. కాగా, ఆ ఇద్దరు వ్యక్తులు సమర్పించినవి బోగస్ పత్రాలేనని, వాస్తవానికి ‘పైగా’ భూములపై 1998లో ఎవరూ పిటిషన్లు వేయలేదని, కోర్టు కూడా ఎలాంటి ఉత్తర్వులు జారీచేయలేదని నిర్ధారిస్తూ హైకోర్టు రిజిస్ట్రీ నివేదిక సమర్పించింది. నిందితులపై క్రిమినల్ కేసు నమోదుకు ఉత్తర్వులివ్వాలని ఏజీ కోరారు. విచారణను నవంబర్ 3కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.