అస్వస్థతకు గురైనా ఆగని కసరత్తు
తుంగతుర్తి, నవంబర్ 19 : ఎస్సై ఉద్యోగం సాధించి ప్రజలకు సేవ చేయాలన్నది అతని చిన్ననాటి కల. ఇందుకోసం సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి పోలీస్ ఉద్యోగా నికి సాధన చేస్తున్నాడు. ఈవెంట్స్ కోసం కసరత్తు చేస్తుం డగా ఛాతిలో నొప్పి వచ్చి కుప్పకూలాడు. దవాఖానలో చేర్పించగా మూడ్రోజులకు కోలుకొని డిశ్చార్జి అయ్యాడు. లక్ష్య సాధనకు వెనుకాడబోనని, మళ్లీ కసరత్తు చేస్తానని ఆ యువకుడు పేర్కొంటున్నాడు. సూర్యాపేట జిల్లా తుంగ తుర్తికి చెందిన రైతు షేక్ ఖాజా మొహినొద్దీన్ కుమారుడు షేక్ అఫ్సర్ నాలుగేండ్లు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు. ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా.. తన చిన్ననాటి కలను సాధించాలనే లక్ష్యంతో రూ.1.20 లక్షల జీతం వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
హైదరాబాద్లో ఉండి సన్నద్ధమయ్యాడు. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యాడు. దిల్సుఖ్నగర్లో ఉంటూ ఈవెంట్స్ కోసం రోజూ వ్యాయామం చేస్తున్నాడు. ఈ నెల 16న ఉదయం వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలాడు. మిత్రులు గమనించి దవాఖానకు తీసుకెళ్లగా చికిత్స అనంతరం కోలుకొని శుక్రవారం సాయంత్రం డిశ్చార్జి అయ్యాడు. ప్రస్తుతం అఫ్సర్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎలాగైనా కసరత్తు చేసి పోలీస్ ఉద్యోగం సాధిస్తానని అఫ్సర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.