Himanshu | హైదరాబాద్ శివారులోని కేశవనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకున్న హిమాన్షు.. దాన్ని కార్పొరేట్ స్కూల్కు ధీటుగా తీర్చిదిద్దారు. ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో క్రియేటివ్ యాక్షన్ సర్వీస్ (సీఏఎస్) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న హిమాన్షు, సీఏఎస్ సభ్యులతో కలిసి వివిధ మార్గాల ద్వారా సేకరించిన విరాళాల నుంచి స్కూల్ను పునర్నిర్మించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల మాట్లాడుతూ ఇంత చిన్న వయసులోనే ఎంతో మంది యువతకు హిమాన్షు ఆదర్శనంగా నిలుస్తున్నారని అన్నారు. మనసుండాలే కానీ వయసుతో పనేముందని నిరూపించారు హిమాన్షు అని అన్నారు.
మంత్రి కేటీఆర్ డైనమిక్ లీడర్గా పలు అభివృద్ధి పనులతో ముందుకు దూసుకెళ్తున్నారని మహేశ్ బిగాల గుర్తు చేశారు. తన తాత ఆశీస్సులతో, తండ్రి అడుగు జాడల్లో ముందుకు నడుస్తూ తాను చదువుకుంటున్న ఖాజాగూడ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీప కేశవనగర్ ప్రభుత్వ బడిని కార్పొరేట్ స్కూలును తలదన్నేలా హిమాన్షు తీర్చిదిద్దారని కొనియాడారు. తాను ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ పది మందికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్నారని చెప్పారు. దీని ప్రతి పక్షాలు జీర్ణించుకోలేక అక్కసు వెల్ల కక్కుతున్నాయని తెలిపారు.
70 ఏండ్ల పరిపాలనలో ఎన్నడూ లేనంతగా జరగని అభివృద్ధి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో జరుగుతుందని మహేశ్ బిగాల పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమం, అభివృద్ధిని జోడు గుర్రాల లాగా పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ విద్యా రంగంలో సమూల మార్పులకు చేపట్టాలన్నారు. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం మన ఊరు – మన బడి ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఈ పథకంతో రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న 19,84,167 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యం అని అన్నారు. అవసరం ఉన్న మేరకు రాష్ట్రంలోని పాఠశాలల అభివృద్ధికే ఈ పథకం ప్రారంభించిందన్నారు.
తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో గల గురుకుల పాఠశాలలు ఎన్ని, తెలంగాణలో సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్ని గురుకులాలు ఉన్నాయని మహేశ్ బిగాల ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 297 గురుకులాలు మాత్రమే ఉండేన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణలో గురుకులాల సంఖ్య 1009కి చేరిందని చెప్పారు. విద్యకు పెద్దపీట వేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు.
కేశవనగర్ ప్రభుత్వ బడిని కార్పొరేట్ స్కూలును తలదన్నేలా తీర్చి దిద్దడం హిమాన్షు గొప్ప ఆలోచనకు నిదర్శనం అని మహేశ్ బిగాల చెప్పారు. పిల్లలకు సరైన సౌకర్యాలు ఉంటే నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. కానీ, చిన్న పిల్లాడు హిమాన్షు చేసిన పనిని మెచ్చుకుంటే ప్రతిపక్షాలకు గౌరవం ఉండేదన్నారు. వాస్తవంగా పది మందికి చేసిన మంచిని మెచ్చుకుంటే పేరు వస్తుందన్నారు. కానీ రాజకీయంగా సీఎం కేసీఆర్ను ఎదుర్కోలేక ఇటువంటి అభివృద్ధి పనులపైనా ఏదో ఒక విమర్శ చేయడం విపక్షాల వంతుగా మారిందన్నారు. సీఎం కేసీఆర్ కృషి వల్లే రాష్ట్రంలో జిల్లాకో వైద్య కళాశాల వచ్చిందని, తెలంగాణలో తప్ప ఏ రాష్ట్రంలో లేవన్నారు.