హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అమలుచేస్తున్న మున్సిపల్ పన్నుల విధానం చాలా బాగున్నదని హిమాచల్ప్రదేశ్ మున్సిపల్ శాఖ అధికారులు ప్రశంసించారు. మున్సిపల్ పన్నుల వసూళ్లు చాలా సులువుగా ఉన్నాయని కొనియాడారు. తెలంగాణ విధానాలను తమ రాష్ట్రంలోనూ అమలు చేస్తామని, అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించాలని రాష్ట్ర మున్సిపల్ అధికారులను కోరారు. ఇందుకు సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ సమ్మతి తెలియజేశారు. హిమాచల్ప్రదేశ్కు చెందిన ఎనిమిది మంది మున్సిపల్ అధికారుల బృందం శుక్రవారం తెలంగాణలో పర్యటించింది. ఈ బృందం మొదట మాసబ్ట్యాంక్లోని సీడీఎంఏ కార్యాలయంలో సీడీఎంఏ ఎన్ సత్యనారాయణతో సమావేశమైంది.
ఈ సందర్భంగా తెలంగాణలో అమలుచేస్తున్న పన్నుల విధానం, సాఫ్ట్వేర్, వసూళ్లకు వినియోగిస్తున్న వివిధ రకాల యాప్లు, క్యూఆర్ కోడ్ విధానం, ఆన్లైన్లో చెల్లింపులు, టీఎస్బీపాస్తో పన్నుల వెబ్సైట్ అనుసంధానం, రిజిస్ట్రేషన్ శాఖతో మున్సిపల్శాఖ అనుసంధానం, భువన్ యాప్ తదితర అంశాలపై సత్యనారాయణ వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం సీడీఎంఏ కార్యాలయంలోని మున్సిపల్ నాలెడ్జ్ సెంటర్ను ప్రతినిధి బృందం సందర్శించింది. నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుపై ప్రశంసల జల్లు కురిపించింది. అనంతరం ఈ బృందం బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ను సందర్శించి, అక్కడ పన్నుల విధానాన్ని క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించింది. హిమాచల్ప్రదేశ్ ప్రతినిధి బృందంలో ధర్మశాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ఐఏఎస్ అధికారి అనురాగ్ చందర్, హిమాచల్ప్రదేశ్ మున్సిపల్ అడిషనల్ డైరెక్టర్ జగన్ ఠాకూర్, మున్సిపల్ అధికారులు బీఆర్ శర్మ, ప్రదీప్వర్మ, రాజేంద్ర చౌహన్, ధరంపాల్శర్మ, కిషన్, అక్షిత్గుప్తా తదితరులు ఉన్నారు.